హుస్నాబాద్, ఫిబ్రవరి 23 : వనదేవతలైన సమక్క-సారలమ్మ జాతర్లలో భక్తజనం హోరెత్తింది. బుధ, గురువారాల్లో వరుసగా సమక్క-సారలమ్మ గద్దెపైకి చేరుకోవడంతో శుక్రవారం ఇద్దరమ్మలను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సమీపంలో జరిగిన జాతరలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. పసుపు, కుంకుమ, బెల్లంప్రసాదం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కన్నపేట మండలం గోవర్థనగిరి, హుస్నాబాద్ మండ లం పొట్లపల్లి గ్రామాల్లో జరుగుతున్న జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆయా జాతరల్లో వెలసిన దుకాణాలు కొనుగోళ్లతో కిటకిటలాడాయి. జాతరకు వచ్చిన భక్తులు దర్శనం అనంతరం అక్కడే వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు.
హుస్నాబాద్ టౌన్, ఫిబ్రవరి 23 : సమ్మక్క -సారలమ్మ ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న అన్నా రు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద ఉన్న సమ్మక్క -సారలమ్మను మున్సిపల్ చైర్పర్సన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని, హుస్నాబాద్ మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. ఆమె వెంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అనిత, మాజీఎంపీపీ ఆకుల వెంకట్, కౌన్సిలర్ పున్నలావణ్య, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు శంకర్రెడ్డి, ఎండీ అయూబ్, పూజారులు ఉన్నారు.
చేర్యాల, ఫిబ్రవరి 23: పట్టణ శివారు బురాన్మియా తోటలో సమ్మక్క-సారలమ్మ జాతర భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నది. అమ్మవార్లు గద్దెల పైకి రావడంతో భక్తులు వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని వసతులు కల్పించారు. నేడు సమ్మక్క-సారలమ్మ వన ప్రవేశం కార్యక్రమం జరుగనుంది.
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి 23: ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించారు. ఎత్తుబంగారం, ఎదురుకోళ్లతో వనదేవతలకు మొక్కు లు సమర్పించారు. కోయపూజారులు అమ్మవార్లకు వారి సంప్రదాయం ప్రకారం పూజలు చేశారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గద్దెల పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ ప్రత్యేకాధికారి రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అనిత, జాతర కమిటీ చైర్మన్ కొండూరి శ్రీనివాస్ అన్ని ఏర్పాట్లు చేశారు.
కొమురవెల్లి, ఫిబ్రవరి 23 : కొమురవెల్లి పాత కామన్ వద్ద కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను భక్తులు దర్శించుకొని మొక్కులు చెలించుకున్నారు. ఇద్దరు అమ్మవార్లు గద్దెనెక్కడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులకు కొమురవెల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
కోహెడ, ఫిబ్రవరి 23: మండలంలోని తంగల్లపల్లి, వింజపల్లి, పరివేద గ్రామాల్లో కొలువైన సమ్మక్క-సారలమ్మ జాతర్లకు భక్తులు పోటెత్తారు. వనదేవతలను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కోహెడ ఎంపీపీ కీర్తి, జడ్పీటీసీ నాగరాజుశ్యామల తంగల్లపల్లిలో అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
గజ్వేల్ అర్బన్, ఫిబ్రవరి 23: గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్లో సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా జరిగింది. పూజారి పరశురాములు ఆధ్వర్యంలో అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
హుస్నాబాద్, ఫిబ్రవరి 23 : మేడారం జాతరలో విధులు నిర్వహిస్తున్న హుస్నాబాద్ పోలీస్స్టేషన్ హెడ్కానిస్టేబుల్ తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. హెడ్కానిస్టేబుల్ మొగిలినాయక్కు మేడారం జాతరలోని జంపన్న వాగు వద్ద డ్యూటీ పడింది. శుక్రవారం అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో రెండేండ్ల బాలుడు తప్పిపోయి ఏడుస్తూ కనిపించడు. వెంటనే స్పందించిన హెడ్కానిస్టేబుల్ తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకొని బాలుడిని అప్పగించారు. తప్పిపోయిన బాలుడిని నిమిషాల వ్యవధిలో తల్లిదండ్రులకు అప్పగించడంతో మొగిలినాయక్ను పోలీస్ అధికారులతోపాటు భక్తులు అభినందించారు.