మెదక్ రూరల్, ఏప్రిల్ 28: గరుడ గంగా పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. మెదక్ మండలం పేరూరు సమీపంలో ఉత్తర వాహినీగా ప్రవహిస్తున్న ఈ నదీ తీరంలో ఉదయం 4 గంటల నుంచే స్నానాలు ఆచరిస్తున్నారు. శుక్రవారం పుణ్యస్నానాలు చేసిన భక్తులు గరుడగంగ సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అభిషేకం, సహస్ర కలశాలతో శివుడికి, పంచలింగాలకు మహోబలాభిషేకాలు, విశేషాలంకరణ, శివ పంచాక్షరీ యజ్ఞం, శివ కేశవ రుద్రాఅభిషేకం నిర్వహిస్తున్నారు. పుష్కర దేవతకు ప్రతేక పూజలు, మంజీరా మంజునాథస్వామికి 1008 కలశాలతో అభిషేకం చేశారు.
పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు నాగుల విభూతిని ధరిస్తూ సరస్వతీ మాత, నాగదేవతను దర్శించుకున్నారు. వేదపండితులు సాయంత్రం శివలింగానికి పసుపు, కుంకుమ, మహాబలాభిషేకం నిర్వహించారు. నిర్వాహకులు స్థానికంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. అన్నదానం చేశారు. అమ్మవారి పూజల్లో సరస్వతీ ఆలయ వ్యవస్థాకుడు బ్రహ్మ శ్రీ దోర్బల రాజమౌళి శర్మ, వేదపండితులు గుణకర్శర్మ, మహేశ్ శర్మ, చిలుకూరి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.