Manjeera Pushkaralu | మెదక్ రూరల్, ఏప్రిల్ 25 : పేరూర్ సరస్వతీ ఆలయం సమీపంలోని గరుడగంగ మంజీరా పుష్కరాలు నాలుగో రోజు వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. మంగళవారం ఉదయం నుంచే ఇతర రాష్ట్రలు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు గరుడగంగ పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొ క్కులు చెల్లించుకున్నారు. దీంతో గరుడగంగ సరస్వతీ క్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. అమ్మవారికి అభిషేకం, సహస్ర కలశాలతో మంజునాథుడికి మహా జలాభిషేకాలు, విశేషాలంకరణ, శివ పంచాక్షరి యజ్ఞం, శివకేశవ రుద్రాభిషేకం నిర్వహించారు. సరస్వతీ ఆలయవ్యవస్థాకుడు బ్రహ్మ శ్రీ దోర్బల రాజమౌళి శర్మ ఆధ్వర్యంలో గుణకారశర్మ, మహేశ్ శర్మ, సరస్వతీ మాతను ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కర దేవతకు ప్రత్యేక పూజలు, మంజీరా మంజునాథస్వామికి 1008 కలశాలతో అభిషేకం చేశారు. వేడుకలకు తరలివచ్చిన భక్తులు మహిమాన్వితమైన గరుడగంగ పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసి నాగుల విభూతిని ధరించి సరస్వతీ మాత, నాగదేవతను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వేదపండితులు మాట్లాడుతూ పుష్కరాల్లో స్నానం ఆచరిస్తే పాపాలు హరించుకుపోతాయని, పితృదేవతలకు శాంతి చేకూరుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పుష్కర స్నానం చేసి పునీతులు కావాలని కోరారు. పవిత్ర గంగా స్నానం చేసేటప్పుడు త్రికరణ శుద్ధితో ఉండి ఆచారాలను భక్తితో నిర్వహించాలని, శుభ్రమైన వస్ర్తాలను ధరించాలన్నారు. భక్తులు స్నానం ఆచరించేటప్పుడు తర్పణలు సాయంత్రం శివలింగానికి పసుపు కుంకుమ, మహాజలా భిషేకం నిర్వహించారు. మంజీరా గరుడగంగ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజఈతగాళ్లను నియమించారు గరుడగంగ పూజల్లో అర్చకులు చిలుకూరి శ్రీనివాస్ వేదపండితులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మంజీరా గరుడగంగ పుష్కరాలు మే 3 వ తేదీ వరకు సాగనున్నాయి. స్నానాలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం, సహస్ర కళశాలతో మంజునాథుడికి అభిషేకం, భజన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు వివరించారు.