చేర్యాల, జనవరి 23 : దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించొద్దని ఒగ్గు పూజారులు సంఘం గౌరవ అధ్యక్షుడు బొద్దుల కిష్టయ్య, అధ్యక్షుడు ఎక్కలదేవి మల్లేశం, కోశాధికారి మక్కపల్లి మల్లేశం, ఉపాధ్యక్షుడు బొద్దుల కనకయ్య కోరారు. ఆదివారం ఆలయ ఈవో బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, సభ్యులు, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్తో కలిసి విలేకరులతో మాట్లాడడంతో పాటు ఒక ప్రకటన విడుదల చేశారు. మల్లన్న ఆలయంలో ఎలాంటి సంప్రదాయ పద్ధతులు మార్చలేదని, పూర్వపు పద్ధతులనే యథావిధిగా ఆచరిస్తున్నట్లు తెలిపారు. దేవాలయ ఆచారం సంప్రదాయలు తెలియని కొందరు వ్యక్తులు ఆలయంలో సంప్రదాయాలు మార్చారంటూ అసత్య ప్రచారాలు చేస్తూ దేవాలయ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాల్లో మొదటి ఆదివారం పట్నం వారం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని అందరి అనుమతితో నిలిపివేశారని, శనివారం సదరు పట్నం, సోమవారం సంప్రదాయానికి విఘాతం కలుగకుండా అంతర్గతంగా పెద్దపట్నం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గర్భగుడిలోకి రానివ్వట్లేదని, వెళ్లగొట్టారని అనడం సరికాదని, భవిష్యత్లో ఆలయం విషయంలో ఎలాంటి ఆరోపణలు చేయొద్దని అన్ని వర్గాలకు ఒగ్గు పూజారులు విజ్ఞప్తి చేశారు. పాత సంప్రదాయం ప్రకారమే ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవం, పట్నం తదితర కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆలయ ఈవో బాలా జీ, చైర్మన్ గీస భిక్షపతి కోరారు. కార్యక్రమంలో ధర్మకర్తలు ఉట్కూరి అమర్గౌడ్, దినేశ్తివారీ, బొంగు నాగిరెడ్డి, చింతల పరశురాములు, కొంగరి గిరిధర్, పోతుగంటి కొంరెల్లి, తాళ్లపల్లి శ్రీనివాస్, శెట్టె అయిలయ్య ఉన్నారు.
ఆలయ ఈవోకు చౌదరి కుటుంబీకుల వినతిపత్రం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో చౌదరి సర్వీస్దార్, యాదవ స్ధానాచార్యుల సేవలను పునరుద్ధరించాలని కోరుతూ చౌదరి కుటుంబీకులు ఆదివారం ఈవో బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతిలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చౌదరి కుటుంబ సభ్యుడు ముద్దం విజయ్కుమార్ తదితరులు మాట్లాడుతూ మల్లన్న ఆలయంలో చౌదరిల సేవలు కొనసాగించాలని ఇప్పటికే దేవాదాయ కమిషనర్ అనిల్కుమార్కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. మల్లన్న ఆలయంలో తమ పూర్వీకులు ఒగ్గు పూజారులతో పట్నం వేయించడం, బోనం నివేదించడం 200 సంవత్సరాలుగా ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. మా వాటా ప్రతిఫలాన్ని సైతం ఒగ్గు పూజారులకు చెల్లిస్తున్నారని, ఉపాధి లేక తాము దుర్భర జీవితాలు గడుపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆలయంలో సేవలు చేసేందుకు ఆవకాశం కల్పించాలని కోరారు.