నిధులు తేకున్నా తెచ్చినట్లు బిల్డప్ ఇస్తున్న ఎమ్మెల్యే రఘునందన్
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో అభివృద్ధి పనులు
హామీలు విస్మరించిన దుబ్బాక ఎమ్మెల్యే
తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ పాత్ర ఎంత..
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
దుబ్బాక టౌన్, ఫిబ్రవరి 11 : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం దుబ్బాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులు పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల తీరును ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో నిధులు తెచ్చి తాము గ్రామాలను అభివృద్ధి చేస్తుంటే, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు తాను నిధులు తెచ్చానని సోషల్మీడియాలో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ పాత్ర ఏందో చెప్పాలని డిమాండ్ చేశారు.
దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్లకు మహర్దశ పట్టనున్నదని టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని రోడ్లను పూర్తి స్థాయి లో ఆధునీకరించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోడ్లకు మంజూరైన నిధులను ఎంపీ వివరిస్తూ.. 2019లో పార్లమెంట్లో దుబ్బాక నియోజకవర్గంలోని 8 రోడ్లకు ప్రతిపాదనలు అందజేస్తే నేడు రెండు రోడ్లకు నిధులు మంజూరయ్యాయన్నారు. దుబ్బాక-ముస్తాబాద్ రోడ్డు విస్తరణకు రూ.8.50 కోట్లు, దొంతి-తుఫ్రాన్-మల్కాపూర్ రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరైనట్లు ఎంపీ తెలిపారు. పీఆర్ పరిధిలో 44 రోడ్లకు ప్రతిపాదనలు పంపితే, రూ.30 కోట్లతో అన్ని మండలాల్లోని 30 రోడ్లకు నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ఒక్క దుబ్బాక నియోజకవర్గంలోనే రోడ్ల అభివృద్ధికి రూ.38 కోట్లు మంజూరైనట్లు ఎంపీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీజేపీని ఏమాత్రం నమ్మవద్దని ఆయన కోరారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల అవసరాలు తెలుసునని కేవలం శిలాఫలకాల మీద పేరు కోసమే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే తహతహలాడుతున్నాడని ఆయన ఆరోపించారు. రోడ్ల ఆధునీకరణకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం చేతుల మీదుగానే ‘బడి’ ప్రారంభిస్తాం..
దుబ్బాక పట్టణంలో సీఎం కేసీఆర్ చదివిన బడి నిర్మా ణం అద్భుతంగా జరిగిందని, త్వరలోనే సీఎం చేతుల మీదుగానే ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాకలో నిర్మించిన డబుల్బెడ్ రూం ఇండ్లకు ఈ నెల 16న నెంబర్లను కేటాయిస్తామని వెంటనే లబ్ధిదారులకు ఇం డ్లను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంటకయ్య, జట్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాస్, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితభూంరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజాలక్ష్మణ్రావు, కౌన్సిలర్లు స్వామి, కనకయ్య, బాలకృష్ణ, యాదగిరి, నాయకులు మల్లారెడ్డి, పల్లె వంశీకృష్ణగౌడ్, పల్లె రామస్వామిగౌడ్, నారా గౌడ్, గుండెల్లి ఎల్లారెడ్డి, బండి రాజు, సర్పంచ్లు రాజయ్య, సద్ది రాజిరెడ్డి, తిమ్మాపూర్ ఎంపీటీసీ రామవరపు మాధవి ఉన్నారు.
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం..
తొగుట, ఫిబ్రవరి 11: రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గోవర్ధనగిరిలో ఇటీవల మరణించిన రైతు మరుపల్లి రామాగౌడ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మండలంలోని వర్ధరాజ్పల్లిలో సీసీ రోడ్ల పనులను ఆయన పరిశీలించారు. ఈ నెల 14 నుంచి మండలంలోని ఘనపూర్లో జరుగనున్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయ వార్షికోత్సవ పోస్టర్ను ఎంపీ ఆవిష్కరించారు.
రఘునందర్రావు అబద్ధాలు మానుకో!
మిరుదొడ్డి, ఫిబ్రవరి 11 : ‘ఎమ్మెల్యే రఘునందన్రావు.. అబద్ధపు ప్రచారం మానుకో.. 14 ఏండ్ల పాటు సుదీర్ఘంగా సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య బద్ధంగా నడిపిన పోరాటంతోనే స్వరాష్ట్రం సిద్ధించింది.. తెలంగాణ ఉద్యమ సమయంలో నీవు ఎక్క డా ఉన్నావ్ బండి సంజయ్? నీ స్థాయి ఏంటో తెలుసుకో’.. అంటూ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధి భూంపల్లిలో యాదవ సంఘం సభ్యులు సమష్టిగా రూ.49 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కల్లాలను ఆయన పరిశీలించారు. ఈ సదర్భంగా ఎంపీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ పుణ్యమా అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే బండి సంజయ్కి అధ్యక్ష పదవి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోవద్దని కొత్త ప్రభాకర్రెడ్డి గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తే, వాటిని తానే మంజూరు చేసిన అని ఎమ్మెల్యే రఘునందన్రావు సిగ్గు లేకుండా వాట్సాప్ గ్రూపు లు, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడని ఎంపీ విమర్శించారు. అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు.
కండ్లున్న కబోదులు బండి, రఘునందన్
కండ్లున్న కబోదులు బండి సంజయ్, రఘునందన్రావు అని ఎంపీ ప్రభాకర్రెడ్డి విమర్శించారు. పబ్లిసిటీ కోసం హైదరాబాద్లో టీవీ ముందు కూర్చొని పిచ్చి కూతలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు లింగం, మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, సర్పంచ్ కాలేరు శ్రీనివాస్, ఉప సర్పంచ్ ప్రభాకర్, నాయకులు దుబ్బరాజం, భూపతిగౌడ్, ప్రతాప్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధిలేదు
చేగుంట, ఫిబ్రవరి 11: కేంద్ర ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం చేగుంట మీదుగా దుబ్బాక వెళ్తున్న సందర్భంగా మండలంలోని బోనాల్లో రైతులు వేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదని, సీఎం కేసీఆర్ రైతు బంధావుడు అన్నారు. రైతులు ఏ పంటలు సాగుచేస్తే లాభాలు పొందే అవకాశం ఉన్న పంటలపై అధ్యయ నం చేసినట్లు చెప్పారు. యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవడంతో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడితో అధిక లాభాలు పొందే విధంగా వ్యవసాయశాఖ అధికారులను అప్రమత్తం చేశారన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు యాసంగిలో రైతులు వరికి బదులుగా ఇతర పంటలు సాగుచేస్తున్నారన్నారు. ఎంపీ వెంట డీసీసీబీ జిల్లా డైరెక్టర్ బక్కి వెంకటయ్య, ఇబ్రహీంపూర్ సొసైటీ డైరెక్టర్ నరేశ్, రైతులు లచ్చిరెడ్డితోపాటు పలువురు రైతులు ఉన్నారు.