సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఆలయాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే, బీజేపీ నేతలు దేవుళ్ల పేరిట రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని మంత్రి తలసాని ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గెస్ట్హౌస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్న స్వామికి రూ.కోటి వ్యయంతో బంగారు కిరీటం చేయించామని, కల్యాణోత్సవం సందర్భంగా అమ్మవార్లకు సైతం బంగారు కిరీటాలు చేయించనున్నామని వెల్లడించారు. ఇష్టారాజ్యంగా మాట్లాడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొమురవెల్లి ఆలయానికి కేంద్రం నుంచి రూ.10 కోట్లు తీసుకురావాలని సవాల్ విసిరారు.
ఎమ్మెల్సీ కవిత విషయంలో బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన కుటుంబ సభ్యులే సహించడం లేదంటూ తూర్పారబట్టారు. దేశంలో బీఆర్ఎస్ విస్తరిస్తుండడంతో ఓర్వలేని మోదీ సర్కారు ఈడీ విచారణ పేరిట ఎమ్మెల్సీ కవితను వేధిస్తోందని మండిపడ్డారు. త్వరలో జరుగనున్న కర్ణాటక ఎన్నికల నుంచే దేశంలో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వందకుపైగా సీట్లలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
– చేర్యాల, మార్చి 12
చేర్యాల, మార్చి 12: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే, బీజేపీ నేతలు దేవుళ్ల పేరిట రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామిని మంత్రి తలసాని ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గెస్ట్హౌస్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవుళ్ల పేరిట రోడ్లపైకి వచ్చి రాజకీయాలు చేసే బీజేపీ నేతలు ఏ ఒక్కనాడూ పూజలు చేసిన పాపాన పోలేదన్నారు. అదే సీఎం కేసీఆర్ యజ్ఞాలు, యాగాల వంటి ఎన్నో దైవిక కార్యక్రమాలు చేస్తున్నాడన్నారు. భక్తిని స్వయంగా సృష్టించలేమని, ప్రజల మనస్సులో నుంచే భక్తి రావాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలు 65 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని, సీఎం కేసీఆర్ పాలన పగ్గాలు చేపట్టిన అనంతరం ఒక్కో ఆలయానికి మహర్దశ పట్టిందని, తాను చిన్ననాటి నుంచి వస్తున్న కొమురవెల్లి క్షేత్రంలో తాగునీరు ఉండేది కాదని, మురికి నీటి గుంటలు ఉండేవన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మంత్రి హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కృషితో ఆలయం
అభివృద్ధికి నోచుకున్నదన్నారు.
అమ్మవార్లకు బంగారు కిరీటాలు చేయిస్తాం..
స్వామివారికి రూ.కోటి వ్యయంతో బంగారు కిరీటం చేయించామని, రానున్న కల్యాణోత్సవానికి అమ్మవార్లకు సైతం బంగారు కిరీటాలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయం ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందని, ఇటీవలే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి సీఎం రూ.500 కోట్లు ప్రకటించారని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అయినా తీసుకువచ్చి ఖర్చు పెట్టారా..? అని ప్రశ్నించారు. రోజూ ఇష్టారాజ్యంగా మాట్లాడే బండి సంజయ్ కేంద్రం నుంచి రూ.10 కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఇతర పార్టీలకు చోటు లేదు..
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు తప్ప ఇతర పార్టీలకు చోటు లేదన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుండడంతోపాటు బీఆర్ఎస్ను విస్తరిస్తుండడంతో అణిచివేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు ఈడీ విచారణ పేరిట ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్నదన్నారు. తప్పు చేయని కవిత మొక్కవోని ధైర్యంతో 9 గంటల విచారణ ఎదుర్కొని ధైర్యంగా వచ్చిందన్నారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి తలసాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణలో వందకు పైగా సీట్లు గెలుస్తాం..
త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల నుంచే దేశంలో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని తలసాని జోస్యం చెప్పారు. రాబోయే శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ
తెలంగవాణలో వందకుపైగా సీట్లలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న బీజేపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు.
బండి వ్యాఖ్యలను ఇంట్లోవాళ్లే సహించడంలేదు…
అసలు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వారి ఇంట్లో వారే సహించడం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నేతలు తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ ఏమీ చేయలేదంటూ విష ప్రచారం చేసే బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చకు రావాలని సవాలు విసిరారు. సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ గీస భిక్షపతి, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, పాలక మండలి సభ్యులు నర్ర రఘువీరారెడ్డి, కొంగరి గిరిధర్, నామిరెడ్డి సౌజన్య, కందుకూరి సిద్దిలింగం, కాసర్ల కనకరాజు, బీఆర్ఎస్ నాయకులు ఏర్పుల మహేశ్ తదితరులున్నారు.