మెదక్ మున్సిపాలిటీ, మార్చి 15: ‘గతేడాది కంటే ఈ యాసంగిలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో అధికంగా వరి సాగు చేస్తున్నారు. క్లస్టర్ వారీగా వారంలో రోజుల్లో క్రాప్ బుకింగ్ వివరాలను అందజేయాలి, దిగుబడులకు అనుగుణంగా అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు వివరాలను అందజేయాలి.’ అని మెదక్ కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రైతుబంధు, రైతు బీమా, ఎరువులు, పంటలు, రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలపై క్లస్టర్ల వారీగా సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంక్ ఖాతా నంబర్ తప్పుగా ఉండటం ఇతర కారణాలతో ఇంత వరకు 10 ఎకరాల్లోపు 2879 మంది రైతులకు రైతుబంధు డబ్బులు పడటం లేదన్నారు. ఈ విషయంపై ప్రత్యేక చొరవ చూపి క్లస్టర్ వారీగా అందరికీ రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే వాన కాలంలో డబ్బుల చెల్లింపులకంటే ముందుగా వాడుకలో లేని ఖాతాలపై రైతులకు అవగాహన కలిగించి కొత్త ఖాతాలు తెరిచేలా చూడాలని, చనిపోయిన రైతుల ఖాతాల వివరాలు తొలిగించాలన్నారు. బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంక్ ఖాతా నంబర్లను సరిచూసుకొని యాప్లో ఆప్డేట్ చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు.
రైతు బీమాకు సంబంధించి డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. చనిపోయిన రైతు కుటుంబ సభ్యులకు సకాలంలో రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వేదిక కేంద్రాలను వినియోగించుకుంటూ వ్యవసాయ, ఉద్యాన శాఖలు సంయుక్తంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వాటర్ సోర్స్ ఉన్న వద్ద వంద ఎకరాల్లో టమాట పంట వేసి క్రాప్ బుకింగ్ చేయాలని సూచించారు. ఏఈవోల వద్ద క్లస్టర్ వారీగా పూర్తి పంట వివరాల సమాచారం ఉండాలని, పీఎం కిసాన్ యోజన కింద ప్రతి ఒక్కరూ కేవైసీ చేసుకునేలా రైతులకు అవగాహన కలిగించాలన్నారు. వాన కాలానికి అవసరమైన రసాయనికి ఎరువులకు ఆయా సంస్థలకు ముందే ఇండెంట్ పెట్టుకోవాలన్నారు. బ్యాంకర్ల సహకారంతో ఆర్థిక సం వత్సం ముగింపులోగా పంట రుణాలు, వ్యవసా య అనుబంధ రుణాల లక్ష్యాలను అధిగమించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయధికారి ఆశాకుమారి, ఉద్యానశాఖ అధికారి నర్సయ్య, వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయధికారులు, విస్తరణధికారులు పాల్గొన్నారు.