దేశపతి శ్రీనివాస్.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందరిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన వాగ్గేయకారుడు. తనదైన మాటలతో, పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ఆయన ప్రస్థానం సాధారణ ఉపాధ్యాయుడిగా ఆరంభమై సీఎం ఓఎస్డీగా సేవలందించేదాకా చేరింది. అంతటితో ఆగకుండా ఎమ్మెల్సీగా రాజ్యాంగబద్ధమైన పదవిని అలంకరించే భాగ్యం ఆయనకు కలగనున్నది. సీఎం కేసీఆర్ దేశపతి శ్రీనివాస్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన దరిమిలా ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. సాహితీవేత్తలు సైతం సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
-సిద్దిపేట, మార్చి 7
సిద్దిపేట, మార్చి 7: దేశపతి శ్రీనివాస్ తెలంగాణలో పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ వాగ్గేయకారుడిగా తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. తన పాటలు, మాటలతో ప్రజలను ఉర్రూతలూగించారు. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడైన దేశపతి శ్రీనివాస్, చిన్ననాటి నుంచి సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఏకపాత్రాభినయాలు చేయడం, నాటికలు వేయడం వంటివి చేసేవారు. కళలు, సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన డిగ్రీలో గోగ్రహనం వంటి నాటకాలు ప్రదర్శించి, ముఖ్య పాత్రలు పోషించి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. సిద్దిపేట పట్టణానికి చెందిన దేశపతి శ్రీనివాస్ 197 0లో దేశపతి గోపాలకృష్ణ-బాలసరస్వతి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు సిద్దిపేటలోనే చదివారు.
ఓయూలో ఎంఏ తెలుగు పూర్తిచేశారు. 1998లో తెలుగు పండిట్గా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళమెత్తాడు. మంజీరా రచయితల సంఘంలో చేరి అనేక రచనలు చేశారు. పాటలు రాశారు. ‘నాగేటి సాళ్లళ్ల నా తెలంగాణ’ పాటతో అనేక మందికి సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 2001లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రారంభమైన మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆయనతో కలిసి నడిచారు. అనేక వేదికల మీద తన పాటలు, మాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. కవి గా, గాయకుడిగా, వక్తగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన సేవలను గుర్తించిన కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమకారుడికి చట్టసభల్లోకి అవకాశం కల్పించడంపై ఉద్యమకారులు, తెలంగాణ సమాజం స్వాగతిస్తున్నది. వారంతా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు…
తెలంగాణ ఉద్యమకారుడిగా తన మాటలు, పాటలతో ప్రజానీకాన్ని చైతన్యపర్చిన దేశపతి శ్రీనివాస్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికం చేయడం సంతోషకరం. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు. తనతో తెలంగాణ ఉద్యమంలో నడిచిన ఉద్యమకారుడికి అవకాశం కల్పించడం సీఎం కేసీఆర్ గొప్పతనం. -కె.రంగాచారి, మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు