రామాయంపేట, ఫిబ్రవరి 8: రామాయంపేట కస్తూర్బా గాంధీ విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన ప్రిన్సిపాల్ ధరణి కుమారిపై చర్యలు తీసుకుంటామని డీఈవో రమేశ్కుమార్ తెలిపారు. బుధవారం కోమటిపల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయానికి కలెక్టర్ ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ బృందం విచారణ చేపట్టింది.
ఈ బృందంలో డీఈవో, రామాయంపేట తాహసీల్దార్ ఎండీ మన్నన్, ఎంఈవో నీలకంఠం ఉన్నారు. మంగళవారం బాలికలు చేపట్టిన నిరసనపై కమిటీ సమగ్రంగా విచారించింది. విద్యార్థులతో ప్రిన్సిపాల్ ధరణి అసభ్య పదజాలంతో మాట్లాడడం, సరైన భోజనం ఇవ్వకుండా ఉండడం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులు, నూనె తదితరాలను పరిశీలించారు. అనంతరం డీఈవో విలేకరులతో మాట్లాడుతూ ప్రిన్సిపాల్పై బాలికలు చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రస్తుతం నెలలో రెండుసార్లు మటన్తో మరో రెండు వారాలు చికెన్ భోజనం పెట్టాలనే నిబంధన ఉందన్నారు. మధ్యాహ్న భోజనంలో చాలీచాలని అన్నం, తక్కువగా కూరగాయలు వేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజూ అసభ్య మాటలతో తిట్టిపోస్తున్నదని, వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, లేనిపోని మాటలు చెబుతున్నదని బాలికలు ఆరోపిస్తున్నారన్నారు. ఈ ప్రిన్సిపాల్ తమకు వద్దని విద్యార్థులు తేల్చి చెప్పారన్నారు. ఈ వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, అప్పటి వరకు ఇన్చార్జి ప్రిన్సిపాల్గా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలును నియమించామన్నారు. బృందం లో రామాయంపేట ఆర్ఐ రాజు, టీచర్లు ఉన్నారు.