మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 9: ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ మహా దేవాలయంలో (చర్చి) ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల నుంచి ఈస్టర్ వేడుకలు కనుల పండుగా ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు. కాళ్లు, చేతులకు కొట్టిన మేకుల గాయాలను చూసి గుర్తెరిగి యేసయ్య లేచి వచ్చాడని ఆనందోత్సాహాలతో ఉప్పొంగి పోతారు. త్వరలో ఈ లోకానికి వస్తా.. అప్పటి వరకు నేనున్నాని తెలియజేయండి అని వెళ్లి పోతాడు. దీనినే క్రైస్తవులు ఈస్టర్ (పునరుత్థాన పండుగ) పండుగగా జరుపుకొంటారు. ఈస్టర్ పురస్కరించుకుని మెదక్ డయాసిస్ పరిధిలోని జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి, ఆంధ్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి వందలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. దూర ప్రాంతాల నుంచి భక్తులు శనివారం నుంచే తరలి రావడంతో వసతి గృహాలు నిండిపోయాయి.
మరణాన్ని జయించి సజీవుడైన దేవుడు : ప్రెసిబేటరీ ఇన్చార్జి శాంతయ్య
మరణాన్ని జయించి తిరిగి సజీవుడైన దేవుడు, యుగయాగాలకు సజీవుడై ఉండే యేసయ్య అని మెదక్ చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య అన్నారు. ఈస్టర్ పండుగ పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని భక్తులకు దైవ సందేశం చేశారు. లోకాన్ని, మరణాన్ని జయించిన దేవుడు, సృష్టికి మూలం ఆరాధ్య దైవం యేసు ప్రభువేనన్నారు. అంతకుముందు చర్చి ఫాస్టర్లు దైవసందేశం చేశారు. వేడుకల్లో చర్చి ఫాస్టర్లు, జైపాల్, శ్రీనివాస్, డేవిడ్, సువర్ణ చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, జాన్సన్, గెలెన్, జాయ్ముర్రే, రోలండ్పాల్, సునీల్, సువన్డగ్లస్, సంశాన్సందీప్ తదితరులు పాల్గొన్నారు.
సిలువ ఊరేగింపుతో ప్రారంభమైన ఈస్టర్ వేడుకలు..
మెదక్ చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య ఆధ్వర్యంలో ఉదయం నాలుగున్నర గంటలకు సిలువ ఉరేగింపుతో ఈస్టర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సిలువకు మహిళలు పెద్ద ఎత్తున కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు. ఆరాధన దైవం, ప్రత్యేక ప్రార్ధనలు, భక్తి గీతాలతో చర్చి ప్రాంగణం హోరెత్తింది. యేసు సమాధి నుంచి లేచివచ్చిన సందేశాలతో భక్తులకు అర్థమయ్యే రీతిలో నాటక రూపంలో మహిళలు వివరించారు. కొంత మంది క్రైస్తవులు తమ ఆప్తుల సమాధుల వద్ద ఆదివారం తెల్లవారు జామున కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు.