తొగుట, మార్చి 20: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన బెజ్జనమైన కనకయ్య, జంగపల్లి నర్సింహులుకు చెందిన మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు దెబ్బతీశాయన్నారు. ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నంగునూరు, మార్చి 20: మండలంలోని దర్గపల్లిలో వడగండ్లకు దెబ్బతిన్న మామిడి తోటలను జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దెబ్బతిన్న పంటల నమూనాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి గీత, ఏఈవో వరుణ్ వర్మ, రైతులు శ్యామ్రెడ్డి, వెంకట్రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్, మార్చి 20: అకాల వర్షానికి మండలంలోని కొల్గూర్, శేర్పల్లి, దిలాల్పూర్, బెజుగామ గ్రామాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలకు నష్టం జరిగింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి మండలంలోని కొల్గూర్లో చెట్టుకొమ్మ విరిగిపడడంతో టెన్త్ విద్యార్థి వెంకటేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయా గ్రామాల్లో సుమారు 120 ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండస్వామి కోరారు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆత్మ కమిటీ డివిజన్ మేనేజర్ మౌనికకు ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న కూరగాయ పంటలను పరిశీలించారు.
బెజ్జంకి, మార్చి 20: మండల కేంద్రంతో పాటు, నర్సింహులపల్లి, రేగులపల్లి, లక్ష్మీపూర్, గూడెం, వడ్లూర్ బేగంపేట, దాచారంతోపాటు పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. మండలంలో 1050 ఎకరాల్లో మొక్కజొన్న, 50 ఎకరాల్లో వరి, 42ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయా ధికారి సంతోష్ కుమార్ తెలిపారు.
చిన్నకోడూరు, మార్చి 20: రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. మండలంలోని చంద్లాపూర్, ఇబ్రహీంనగర్, చౌడారంలలో దెబ్బతిన్న పంటలను వారు పరిశీలించారు. రైతుల కు నష్టపరిహారం అందించా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల్లో జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్, మండల వ్యవసాయాధికారి జయంత్ కుమార్ క్షేత్రస్థా యిలో పంటలను పరిశీలించి నష్టం వివరాలు సేకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయలక్ష్మి, ఎంపీటీసీ దుర్గారెడ్డి, నాయకులు రవిగౌడ్, చంద్రమౌళి, రైతులు ఉన్నారు.