నారాయణరావుపేట, జనవరి 12: గులాబీ అధినేత కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కొనసాగించాలని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండలకేంద్రమైన నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెండింగ్లో ఉన్న గృహలక్ష్మి పథకం బిల్లులు చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడారు. కేసీఆర్ సర్కారు హయాంలో గృహలక్ష్మి పథకం ప్రొసీడింగ్ కాపీలు తీసుకున్నామని చెప్పారు. పాత ఇల్లు కూలగొట్టి అప్పులు తీసుకొచ్చి గృహ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే దిగిపోవాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనపై అవగాహన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మహిళలు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి దిగిపోవాలని మహిళలు అసహనం వ్యక్తం చేశారు. గులాబీ అధినేత కేసీఆర్ వస్తే తమకు బిల్లులు వచ్చేవన్నారు. అనంతరం తహసీల్దార్కు మహిళలు వినతిపత్రం అందజేశారు.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహకారంతో ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. మేము కూలీనాలి చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే రూ.3 లక్షలతో ఇల్లు కట్టుకుందామని అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసింది. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
మాకు ఇల్లు కట్టుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం రూ.3 లక్షల ప్రొసీడింగ్ కాపీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్రెడ్డి వచ్చిన తర్వాత ప్రొసీడింగ్ను రద్దు చేసింది. ఎన్నో అప్పులు చేసి ..కూలీ పని చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటున్నాం. చాలా ఏండ్ల నుంచి కిరాయికి ఉంటున్న తమకు కేసీఆర్ ప్రభుత్వం ప్రొసీడింగ్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఇప్పుడు మేము ఏం చేయాలి.. ఇది న్యాయమా.. తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.