చిలిపిచెడ్, జూన్ 7: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవాన్ని నర్సాపూర్ నియోజక వర్గంలోని చిలిపిచెడ్ మండలంలో వైభవంగా నిర్వహించారు. అజ్జమర్రి చెక్డ్యాం వద్ద మంజీరా నదిపై నిర్మించిన చెక్డ్యాం వరకు బోనాలు, బతుకమ్మలతో మహిళలు డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. ఈ ఉత్సవాల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, రిటైర్డు ఇంజినీర్ మల్లయ్య పాల్గొని, ప్రత్యేక పూజలు చేసి చెక్డ్యాం శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం బతుకమ్మ, తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగు నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాస్రావు పాల్గొని నర్సాపూర్ నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చేపట్టి ప్రగతి నివేదికను చదివి వినిపించారు.
అజ్జమర్రి చెక్డ్యాంతో పుష్కలంగా నీరు: కలెక్టర్ రాజర్షిషా
చిలిపిచెడ్ మండలంలోని మంజీరా నదిపై నిర్మించిన అజ్జమర్రి చెక్డ్యాం ప్రారంభించడం హర్షదాయకమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మూడు మీటర్ల ఎత్తు సుమారు రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించడంతో ఆరు కిలోమీటర్ల దూరం వరకు మంజీరా నది నిండుకుండ లా ఉన్నదన్నారు. ప్రతి గ్రామం సస్యశ్యామలం కావాలని సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు, వనదుర్గా, హల్దీవాగు, ప్రతి ఊరిలోని చెరువును తీర్చిదిద్దడంతో నేడు జలకళ ఉట్టిపడుతున్నదన్నారు. ఇటీవల సిద్దిపేటకు వచ్చిన పంజాబ్ సీఎం కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఆశ్చరం వ్యక్తం చేశారన్నారు. పంజాబ్లోనూ ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్తోనే నిర్మాణమైంది: ఎమ్మెల్యే మదన్రెడ్డి
సీఎం కేసీఆర్ కృషితోనే చెక్డ్యాం నిర్మాణం సాధ్యమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. అప్పట్లో తనతో పాటు రిటైర్డు ఈఈ మల్లయ్య, భూంలింగం, సంగారెడ్డి ఐబీలో ఒకే రూమ్లో ఉండి చెక్డ్యాంల నిర్మాణం కోసం రూపకల్పన చేశామన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో సంగారెడ్డి జిల్లాలోని పలుపనూరు నుంచి మెదక్ జిల్లాలోని పైతర వరకు పద్నాలుగు చెక్డ్యాంలు నిర్మించుకున్నామన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 28 రైతువేదికల వద్ద రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. మల్లన్నసాగర్ ద్వారా సింగూరును గోదావరి జలాలతో నింపి మెదక్ జిల్లాకు తెస్తామన్నారు.
సీఎం కేసీఆర్తోనే రాష్ట్రం సుజలాం : సునీతారెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్
ఒకప్పుడు ఎడారిలా ఉండే ఈ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ కృషితో చెక్డ్యాం నిర్మాణంతో సస్యశ్యామలం అయ్యిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగు నీరందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఒక్కో చెక్డ్యాం నిర్మాణంతో ఆరేడు కిలోమీటర్లు నీళ్లు ఆగుతున్నాయని, దీంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. చాముండేశ్వరీ ఆలయం దగ్గర వంతెనపై నుంచి రెండు పక్కలా నీటిని చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. నాటి బీడు భూములన్నీ నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు. కాళ్వేశరం ప్రాజెక్టు 18లో భాగంగా రూ.758 కోట్ల ఏడు లక్షలతో నర్సాపూర్ నియోజకవర్గంలో 15 వేల ఎకరాలకు సాగు నీరందించాలనే సంకల్పంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 19లో భాగంగా రూ.762 కోట్ల 47 లక్షలతో నర్సాపూర్ నియోజకవర్గంలోని 26వేల 669 ఎకరాలకు నీరందించాలనే సంకల్పంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన నిర్మాణమని, దాని గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.
నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందించి, ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని రిటైర్డ్ ఈఈ మల్లయ్య అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్ అహ్మద్, ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, ఎంపీడీ వో శశిప్రభ, తహసీల్దార్ ముసాదిక్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, కౌడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, కౌడిపల్లి ఎంపీపీ రాజునాయక్, బీఆర్ఎస్ నాయకుడు పైడి శ్రీధర్ గుప్తా, హత్నూర జడ్పీటీసీ ఆంజనేయిలు, ఇరిగేషన్ ఏడీ శ్రీనివాస్రావు, ఏఈలు విక్రమ్, ప్రదీప్రెడ్డి, మండ ల రైతు సమితి కో ఆర్డినేటర్ రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంబర స్వామి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అశోక్రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సుభాష్రెడ్డి, సోమక్కపేట సొసైటీ ఇన్చార్జి చైర్మన్ రాంచంద్రారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు షపీయొద్దీన్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు సయ్యద్ హుస్సేన్, గిర్దావర్ నాగరాజు, కౌడిపల్లి ఆత్మ డైరెక్టర్ మల్కాని వీరస్వామి, సత్యం, బీసీ సెల్ మండలాధ్యక్షుడు పోశయ్య పాల్గొన్నారు.