జీవో 58 దరఖాస్తుల విచారణను వందశాతం పూర్తిచేయాలి
ప్రతి మండల కేంద్రంలో సదస్సు ఏర్పాటు చేయాలి
వచ్చేనెల 15 నాటికి స్టడీ సర్కిల్ను సిద్ధం చేయాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ సోమేశ్ కుమార్
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 8: ఈ నెల 15 నుంచి రెవె న్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కలెక్టర్ను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. జీవో 58 కింద వచ్చిన దరఖాస్తుల ప్రాథమిక విచారణ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలన్నారు, జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో 3 రోజులకు మించకుండా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు.
ఈ సదస్సులను విశాలమైన వేదికల్లో నిర్వహించాలని, కంప్యూటర్లు, ప్రింటర్, జిరాక్స్ మిషన్, కౌంటర్లు, మొబైల్ మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ గురుకుల పాఠశాలలు మంజూరైన ప్రాంతాల్లో స్టడీ సర్కిల్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఆగస్టు 15 నాటికి స్టడీ సర్కిల్ను ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్నారు. ధరణిలో వెబ్సైట్లో ఉన్న మాడ్యూల్స్ను పీపీటీ ద్వారా సీఎస్ అధికారులకు వివరించారు. దరఖాస్తులోని ఆధారాలను పరిశీలించి అందుబాటులో ఉన్న కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో 27 మండలాల్లో రెవెన్యూ సదస్సులు
కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో 27 మండలాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు 6 బృందాలు ఏర్పాటు చేస్తున్నామని సీఎస్కు వివరించారు. 5 బృందాలకు 5 మండలాల చొప్పున ఒక బృందానికి రెండు మండలాలు కేటాయించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సేవలను రెవెన్యూ సదస్సుల్లో వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని రెవెన్యూ సదస్సుల కోసం అవసరమైన ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డీఆర్వో రాధికా రమణి, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.