నిజాంపేట, మార్చి19: వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రం నిజాంపేటతోపాటు బచ్చురాజ్పల్లి, తిప్పనగుల్ల గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించి, బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు ప్రభుత్వం చేయూత ఉండేదన్నారు. నిజాంపేట మండలంలో 2 వేల ఎకరాల మేర పంట నష్టం వాటిల్లిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిలబడి ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయనవెంట ఎంపీపీ సిద్ధిరాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మాజీ సర్పంచులు అమరసేనారెడ్డి, గేమ్సింగ్, మాజీ ఎంపీపీ సంపత్, ఎంపీటీసీ బాల్రెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, సోషల్ మీడియా మండలాధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నాయకులు నరేందర్, యాదగిరి, పత్తినాయక్, రంజిత్గౌడ్, రైతులు సుధాకర్, సిద్ధిరాములు, లక్ష్మణ్, యాదగిరి, నరేశ్, సుజాత, మణెమ్మ తదితరులు ఉన్నారు.