మెదక్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్ ధాన్యంపై రూ.500 బోనస్ ఇస్తే రైతులకు కొంత ఊరట లభిస్తుందని ఆమె తెలిపారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేం ద్రం ఏర్పాటు చేసి రూ.500 బోనస్ ఇవ్వాలని, ఎండుతున్న పంటలకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్తో కలిసి పద్మాదేవేందర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పిలుపు మేరకు బోనస్ విషయంలో మెదక్ కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ రాహుల్రాజ్కు వినతిపత్రం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూస్తుంటే ఈ సీజన్లో వరికి బోనస్ ఇవ్వడం అనుమానంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక అన్ని హామీ లు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, గెద్దెనెక్కి వంద రోజులు పూర్తయినా అమలు చేయడం లేదన్నారు. కేసీఆర్ రైతు పక్షపాతి అని, వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమా లు అమలు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేయూత లభించిందన్నారు.
రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వాలని, నాణ్యమైన కరెంటు, సాగునీరు అందించాలని, పండించిన పంటకు బోనస్ ఇస్తూ గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించామని, కొన్న ధాన్యానికి సంబంధించి వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారుకు పరిపాలనపై అవగాహన లేదని, ప్లానింగ్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారన్నారు. 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను విస్మరించిందని విమర్శించారు. వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జడ్పీ వైస్చైర్పర్సన్ లావణ్యరెడ్డి, ఎం పీపీల ఫోరం అధ్యక్షుడు హరికృష్ణ, బీఆర్ఎస్ మెదక్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు సోములు, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్రెడ్డి, రాజు, కొల్చారం, చిలిపిచెడు ఎంపీపీలు మం జుల కాశీనాథ్, వినోదా దుర్గారెడ్డి బీఆర్ఎస్ నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, బాగారెడ్డి, అంకం చంద్రకళ రవి, ప్రతాప్రెడ్డి, లక్ష్మణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.