గజ్వేల్, మార్చి 23: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా శనివారం రూ.50లక్షలు పట్టుబడ్డాయని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 9గంటల ప్రాంతంలో అంబేద్కర్ చౌరస్తాలో సీఐలు సైదా, ముత్యంరాజు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా టీఎస్36సీ 0198 వాహనంలో రాయపోల్ గ్రామానికి చెందిన బచ్చు రత్నాకర్ ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు తీసుకుపోతుండగా తనిఖీలో పట్టుబడడంతో సీజ్ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల సంఘం ఆదేశానుసారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు రూ.50వేలకు మించి డబ్బులను వాహనాల్లో తీసుకొని వెళ్లరాదన్నారు. ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్తే వాటికి సంబంధించిన పత్రాలను దగ్గరే ఉంచుకోవాలని, లేనియెడల డబ్బులను సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగిస్తామని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాహన తనిఖీలకు సహకరించాలని కోరారు.