చేర్యాల, మే 23 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను ఈ నెల 27వ తేదీన లెక్కిస్తామని ఆలయ ఈవో ఏ.బాలాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం వేసవి సెలవులు రావడంతో భక్తులు కొమురవెల్లికి భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.
దీంతో హుండీలు భక్తుల కానుకలతో నిండిపోయాయని, వెంటనే వాటిని ఓపెన్ చేసి లెక్కింపు నిర్వహించి నగదును బ్యాంకులో జమచేయనున్నట్లు తెలిపారు. అలాగే భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న బియ్యం హుండీలను తెరిచి వాటిని తూకం వేయనున్నట్లు పేర్కొన్నారు.
హుండీ లెక్కింపులకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు పోలీస్, రెవెన్యూ అధికారులు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో ఏఈవో వైర్యాగం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ తదితరులున్నారు.