కాంగ్రెస్, బీజేపీలకు వరుస షాక్లు తగులుతున్నాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆదివారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సమక్షంలో కంగ్టి మండలంలోని భీమ్రా తండాకు చెందిన 30 కుటుంబాల కాంగ్రెస్, బీజేపీ నాయకులు, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చౌటకూరు ఉపసర్పంచ్ మన్నె నాగయ్య బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం పనిచేస్తున్నదన్నారు. పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
– చౌటకూర్/కంగ్టి, జూలై 30
నారాయణఖేడ్, జూలై 30: నారాయణఖేడ్లోని 10వ వార్డులో ఉన్న మహంకాళి మందిరానికి పూర్వవైభం తెచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి హామీనిచ్చారు. మహంకాళి మందిరం శిథిలావస్థకు చేరడంతో స్థానికుల అభ్యర్థన మేరకు ఆదివారం రూ.10 లక్షల నిధులతో బీసీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహంకాళి మందిరానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నదన్నారు. భక్తుల కోరిక మేరకు మందిరం పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలోని శ్రీసత్యసాయి కాలనీలో ఉన్న మహతి జ్యోతిష్యాలయంలో అధిక శ్రావణ మాసం సందర్భంగా కొనసాగుతున్న విష్ణు సహస్ర నామ సహిత రుద్ర చండీయాగంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చండీయాగం క్రతువును వైభవోపేతంగా నిర్వహిస్తున్న వైదిక వేద స్మార్థ పురోహితులు గురురాజశర్మతో పాటు భక్తులను ఎమ్మెల్యే అభినందించారు.
మండలంలోని అబ్బెంద గ్రామంలో చర్చి నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేసిన నేపథ్యంలో గ్రామస్తులు ఎమ్మెల్యేను చర్చికి ఆహ్వానించి అభినందన సభ ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ, అందరి మనోభావాలకు అనుగుణంగా పాలిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అందరి దీవెనలతో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్కు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఆరోగ్యశ్రీ వర్తించని పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన నిరుపేదలను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం సీఎం సహాయనిధితో ఆర్థిక సాయమందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ పరశురామ్, కోఆప్షన్ సభ్యుడు అంబాదాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నగేశ్, మాజీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్, నాయకులు రవీందర్నాయక్, సుదర్శన్గౌడ్, అభిషేక్ శెట్కార్, శేఖర్, రాంచంద్రాగౌడ్, ర్యాకల గోపాల్, రమేశ్ చౌహాన్, అబ్బెంద సర్పంచ్ సుదర్శన్రావు, తదితరులు పాల్గొన్నారు.
చౌటకూర్, జూలై 30: అందోల్ నియోజకవర్గంలోని చౌటకూర్ గ్రామ ఉప సర్పంచ్ మన్నె నాగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో ఆదివారం చేరారు. బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జనరంజక పాలన చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. తెలంగాణను ప్రగతి పథంలో అగ్రగామిగా నిలిపిన దార్శనిక పాలకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్నదన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలనను చూసే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. బీజేపీ అందోల్ నియోజకవర్గంలో కనుమరుగైందన్నారు. కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అందుకే ప్రజలు, యువత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. అనంతరం పార్టీలో చేరిన ఉప సర్పంచ్ మన్నె నాగయ్య మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఒంటెద్దు పోకడలు నచ్చకనే బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. దామోదర చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తుంటారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్, చౌటకూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రభులింగం గౌడ్, సీనియర్ నాయకుడు ఎండీ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.