ఎదురుచూపులకు తెరపడింది. సొంతింటి కల సాకారమైంది. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. సంగారెడ్డి శివారు ఫసల్వాది వద్ద రూ.20 కోట్లతో నిర్మించిన 329 ఇండ్లు, కంది వద్ద రూ.6కోట్లతో నిర్మించిన 96 రెండు పడకల గదుల ఇండ్లను బుధవారం జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ,కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎంపికైన వారికి మంజూరు పత్రాలు అందజేయగా, లబ్ధిదారులు పాలు పొంగించి, పూజలు చేసి తమకు కేటాయించిన ఇండ్లల్లోకి వెళ్లారు. ఏండ్ల తరబడి అద్దెలు కట్టలేక అవస్థలు పడ్డామని, జీవితాంతం కష్టపడినా సొంతంగా చిన్న ఇల్లును కూడా నిర్మించుకోలేని తమకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు.
– కంది, నవంబర్, 30
కంది, నవంబర్ 30: ‘పేదల సొంతింటి కల సాకారం చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో తలెత్తుకు బతకాలన్నదే ఆయన లక్ష్యం.’ అని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది మండల శివారు, సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులో నిర్మించిన 425 రెండు పడక గదుల ఇండ్లను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్రెడ్డి, కలెక్టర్ శరత్తో కలిసి ప్రారంభి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. కంది మండల పరిధిలో రూ.6కోట్లతో 4బ్లాక్లుగా నిర్మించిన 96ఇండ్లను కాశీపూర్, ఏర్ధనూర్, కంది, ఉత్తర్పల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు తాంబూలంలో స్వీట్, పండ్లు, పసుపు, కుంకుమతో పాటు ఇంటి సర్టిఫికెట్లను పెట్టి అందజేశారు.
సంగారెడ్డి మండలం ఫసల్వాది వద్ద సుమారు రూ.20కోట్లతో నిర్మించిన 329 రెండు పడక గదులను కులబ్గూర్, సంగారెడ్డి, ఫసల్వాది గ్రామాల లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాతే అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నారన్నారు. సర్వమత సమానత్వమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో డబుల్ బెడ్రూమ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. ఒకేసారి ఇంత మందికి సొంతిండ్లు రావడం సంతోషంగా ఉందన్నారు. పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేయడం, ఇంటిని పొందిన లబ్ధిదారుల కండ్లల్లో ఆనందబాష్పాలు చూస్తున్నామన్నారు. అన్ని కుటుంబాలు ఐక్యతతో కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. శానిటేషన్ తదితర బాధ్యతలన్నీ స్థానిక సర్పంచ్లదేనని స్పష్టం చేశారు. ఇండ్లు రానివారు నిరాశ చెందవద్దని, మరో దఫాలో మిగితా అందరికీ వస్తాయని తెలిపారు. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు చింతా
ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
కల నెరవేర్చిన సీఎం కేసీఆర్
జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్రెడ్డి మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ అందించాలన్న దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తున్నారని కొనియాడారు. గత రెండేండ్లుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారుల సొంతింటి కల ఎట్టకేలకు నెరవేరిందన్నారు.
తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజ..
ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు గౌరవంగా బతికేలా అన్ని వసతులతో ఇంటిని నిర్మించి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఉద్యమ నాయకుడిగా అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తిగా తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముందుంచుతున్నారని కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఆర్థిక సమానత్వం కోసం కృషి చేస్తున్నారన్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. ఇండ్లను పొందిన లబ్ధిదారులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇండ్లను పొందిన వారందరూ ఇంట్లో ఉండాల్సిందేనని, తాళాలు వేయరాదన్నారు. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కాలనీలో ఏ అవసరాలు, సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా, లాటరీ పద్ధతిలో చేశామని, అనర్హులు ఎవరైనా ఉంటే తెలుపాలని మరోసారి విచారణ చేసి అర్హులైతేనే ఇస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, కంది ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, సర్పంచ్ విమలా వీరేశం, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్రెడ్డి, కంది మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, నాయకులు చిల్వేరి ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ మనోహర్గౌడ్, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఆర్అండ్బీ అధికారులు, రెండు పడక గదుల లబ్ధిదారులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
సొంతింటి కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్కు మా కుటుంబం రుణపడి ఉంటుంది. 15 ఏండ్ల్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న మాకు డబుల్ బెడ్ రూమ్ రావడం చాలా ఆనందంగా ఉంది. సొంతిల్లు ఉంటే ఇంటి ఖర్చులు కూడా తగ్గుతాయి. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం.
– చింతకింది లావణ్య, లబ్ధిదారురాలు, కంది
ఇల్లు లేక చాలా బాధపడ్డాం
అద్దె ఇంట్లో ఉంటూ చాలా బాధలు పడ్డాం. రోజు కూలీ చేసుకొని బతికే మాకు ఇల్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేదు. జీవితంలో సొంతిల్లు ఉండదనుకున్న మాకు డబుల్ బెడ్ రూం రావడం ఎంతో ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన సొంతింటితో భవిష్యత్తు జీవితంపై నమ్మకం పెరిగింది.
– పుష్పలత, ఫసల్వాది, సంగారెడ్డి మండలం
కల నెరవేరింది
సీఎం కేసీఆర్ దయతో సొంతింట్లోకి వచ్చాం. ఇల్లు నిర్మించుకోవడం జీవితంలో మాతో అయ్యే పని కాదు. నెల వచ్చిందంటే అద్దె కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు దర్జాగా సొంతింట్లో ఉంటామన్న ధీమా వచ్చింది. పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అన్ని వేళలా అండగా ఉంటాం. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. – నాగమణి, లబ్ధిదారురాలు, సంగారెడ్డి