– విద్యార్థులకు మధిర ఎక్సైజ్ సీఐ రాములు సూచన
ఎర్రుపాలెం, జూలై 30 : నేటి యువత మాదక ద్రవ్యాల మత్తులో జీవితాన్ని నాశనం చేసుకోకుండా, విద్యనే ఆయుధంగా చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని మధిర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐ రాములు సూచించారు. మండల కేంద్రం ఎర్రుపాలెంలోని ఎస్జేకేఎం కళాశాలలో గురువారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మధిర శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాములు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్ను అంధకారంలోకి నెట్టివేస్తాయని, వాటి బారిన పడితే విద్యతో పాటు ఆరోగ్యం, కుటుంబ జీవితం కూడా తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం వ్యసనాలకు బానిస కాకుండా, కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ నాగిరెడ్డి సౌజన్య మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి స్నేహాలను పెంపొందించుకుని, వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం విద్యార్థులు మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నాగిరెడ్డి రమేశ్, ఆకుల రవి, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.