తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavams ) భాగంగా ఆరో రోజు ఆదివారం సాయంత్రం స్వర్ణరథోత్సవం( Golden Chariot ) అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. శ్రీ మలయప్పస్వామి ( Malayappa Swamy ) వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన మిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ స్వర్ణరథోత్సవం కన్నులపండువగా సాగింది.
స్వామివారి దర్శనం కోసం తిరుమాడ వీధులకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ‘ గోవింద.. గోవిందా’ అంటూ నామస్మరణ చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని భక్తిశ్రద్ధలతో లాగారు. ఈ స్వర్ణరథోత్సవంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ, పలువురు బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


