జహీరాబాద్, ఫిబ్రవరి 4 : వర్షపు నీటిని నిల్వ చేసి, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం వాగులపై చెక్డ్యాంలు నిర్మాణానికి భూ సర్వే చేసి నిధులు మంజూరు చేసింది. జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడం, వర్షపు నీటిని నిల్వ చేసేందుకు భారీ ప్రాజెక్టులు లేవు. జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో కురిసిన వర్షం నీరు కర్ణాటక వైపు పరుగులు తీస్తుంది. వర్షం నీరు నిల్వ లేక భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వాగులు, కాల్వలపై రూ.7.14 కోట్లతో చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. నీటివనరుల శాఖ అధికారులు స్థలాలను గుర్తించి, అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించారు. చెక్డ్యాంల నిర్మాణానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ కృషి చేశారు. కోహీర్ మండలం గోటిగార్పల్లి శివారు నుంచి ప్రవహిస్తున్న పెద్దవాగుపై జాడిమాల్కాపూర్ శివారులో రూ.2.85 కోట్లతో చెక్డ్యాం నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. జాడిమాల్కాపూర్ చెక్డ్యాం నిర్మాణంతో 560 ఎకరాలకు మేలు కలుగుతుంది. జహీరాబాద్, న్యాల్కల్ మండలాల్లో వాగులపై నిర్మాణం చేసే 5 చెక్డ్యాంతో పదివేల ఎకరాలకు మేలు కలుగుతుందని నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మా ణం చేస్తుంది.
పెద్దవాగు నుంచి ఏటా కర్ణాటక వైపు వరద నీరు ప్రవహిస్తుంది. వరదనీరు నిల్వ చేసి, వ్యవసాయనికి సాగునీరు అందించే లక్ష్యంతో చెక్ డ్యాం నిర్మాణానికి నీటిపారుల శాఖ అధికారులు భూ సర్వే చేశారు. వాగుపై చెక్డ్యాం నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయి. దీంతో 560 ఎకరాలు వ్యవసాయ బావులు, బోరుల ద్వారా మేలు కలుగుతుందని అధికారులు అంచనా వేశారు. రెండు గట్ల మధ్య చెక్డ్యాం నిర్మాణంతో భారీగా వరద నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. భారీ చెక్డ్యాం నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పం పించగా, అనుమతి ఇచ్చింది. టెక్నికల్ అనుమతి రాగానే టెండర్లు వేసి పనులు ప్రారంభించేందుకు నీటిపారుద శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. జాడిమాల్కాపూర్ శివారులో చెక్డ్యాం నిర్మాణం తో మల్చల్మా, గోటిగార్పల్లి, జాడిమాల్కాపూర్, సజ్జారావుపేట తండా, కర్ణాటకలోని వెంకటపూర్, సంగాపూర్ తండాతోపాటు పలు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది.
న్యాల్కల్ మండలంలోని చినిగేపల్లిలో వాగు పై చెక్డ్యాం నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పం పించారు. చెక్డ్యాం నిర్మాణానికి రూ.1.15 కోట్లు, న్యాల్కల్ మండలం హుమ్నాపూర్ శివారులోని బోడేగం వాగుపై చెక్డ్యాం నిర్మాణానికి రూ. 1.05 కోట్లు, చీకుర్తి గ్రామంలో ఉన్న వాగుపై చెక్డ్యాం నిర్మాణానికి రూ.70.50లక్షలు మం జూరు చేసింది. చినిగేపల్లి వాగు నుంచి వరదనీరు మంజీరా నదిలోకి వెళ్తుంది. వరద నీటిని నిల్వ చేయడంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఝరాసంగం మండలం కుడిసం ఘం వాగుపై చెక్డ్యాం నిర్మాణానికి రూ. 60.50 లక్షల నిధులు మంజూరు చేసింది. జహీరాబాద్ మండలంలోని మల్చల్మా పెద్దవాగుపై చెక్డ్యాం నిర్మాణానికి రూ.78 లక్షలు మంజూరు చేసింది. నీటిపారుదల శాఖ అధికారులు టెండర్లు వేసి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద నీటి వనరులు లేకపోవడంతో రైతులు వాననీటితో పం టలు సాగు చేస్తున్నారు. వర్షపు నీరు నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు 7.14 కోట్లతో చెక్డ్యాంలు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చాం. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయి. దీంతో వ్యవసాయ పంటల సాగు పెరిగి రైతులకు మేలు కలుగనున్నది. చెక్డ్యాంల నిర్మాణంతో 11 వేల ఎకరాలకు మేలు కలుగుతుంది.
-కొనింటి మాణిక్రావు, ఎమ్మెల్యే జహీరాబాద్
జహీరాబాద్, న్యాల్కల్, మొగుడంపల్లి, ఝరాసంగం మండలాల్లో చెక్డ్యాంల నిర్మాణానికి భూ సర్వే చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. టెక్నికల్ అనుమతి రాగానే టెండర్లు వేసి పనులు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. వరదనీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, సర్వే చేసి నివేదిక పంపించాం. ప్రభుత్వ అనుమతి రాగానే చెక్డ్యాంల నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
-విజయ్కుమార్, ఈఈ నీటివనరుల శాఖ, జహీరాబాద్