మెదక్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ముగింపు దశలోని 1,600 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు శరవేగంతో పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్లో ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల వారీగా ఇండ్ల నిర్మాణ ప్రగతి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టరింగ్, తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రిసిటీ వంటి మిగిలిన చిన్నచిన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇండ్ల నిర్మాణాలు చేసిన పది మండలాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఉపాధికి హామీ కింద సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.
లబ్ధిదారులను గుర్తించి పారదర్శకంగా ఎంపిక చేయాలని ఆదేశించారు. ఇంతవరకు అందజేసిన 1,234 ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లోని నిబంధనల మేరకు సకాలంలో పనులు పూర్తి చేయాలని, ఏఏ పనులు ఎప్పటి వరకు పూర్తిచేస్తారో కార్యాచరణ నివేదిక అందజేయాలని, నిర్మాణాలకు అవసరమైన ఇసుకను సరఫరా చేస్తామని చెప్పారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్, డిప్యూటీ ఇంజినీర్లు, సహాయ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.