గజ్వేల్, మే 15: పేదలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరింది. సొంత ఇల్లు లేని ప్రజల ఆశలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. గజ్వేల్ పట్ణణ సమీపంలో సంగాపూర్ వద్ద సర్వే నెంబర్ 68లో 1200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించారు. ఇండ్ల నిర్మాణం కోసం 2015లో సీఎం కేసీఆర్ శంకస్థాపన చేశారు. ఒక్కో ఇల్లు 570 చదరపు గజాల విస్తీర్ణంలో 156 బ్లాకుల్లో కాలనీ నిర్మాణం పూర్తి చేసి అన్ని వసతులు కల్పించారు. విద్యుత్, మురుగుకాల్వల నిర్మాణం, రోడ్లు, భగీరథ నీటి సరఫరా, ఫంక్షన్హాల్ నిర్మాణం, దుకాణ సముదాయాలతో పాటు తదితర సౌకర్యాలు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావు కృషి ఫలితంగా త్వరగా నిర్మాణాలు పూర్తి చేశారు.
ఇండ్ల మధ్యలో మొక్కల పెంపకం చేపట్టారు. ఇండ్ల ఎంపిక కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. సుమారు 3800 మంది ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో వివిధ శాఖల అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. చివరగా 1550 మందితో కూడిన జాబితా రూపొందించారు. ఇందులో నుంచి 1100 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను లక్కీ డ్రా పద్ధతిలో చేపట్టారు. త్వరలోనే లబ్ధిదారులకు ఇండ్లు చూపించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇల్లు రావడం సంతోషం
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం తీసిన లక్కీ డ్రాలో ఇల్లు వచ్చింది. ఎన్నో ఏండ్ల నుంచి సొంతిటి కోసం ఎదురుచూస్తున్నాం. మాలాంటి పేదల కోసం సీఎం కేసీఆర్ సారు కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బాగున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన తమ కల నెరవేరింది. సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– బండారి లక్ష్మి, లబ్ధిదారురాలు, గజ్వేల్
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
మా కుటుంబానికి అండగా ఉన్న సీఎం కేసీఆర్ సార్ను మర్చిపోము. ఎన్నో ఏండ్ల సొంతింటి కలను నిజం చేసి నన్ను ఓ ఇంటి వాడిని చేశాడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మాకు ఇల్లు రాలేదు. అద్భుతంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు అందించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మా కుటుంబానికి ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది.
– మహ్మద్ రంజాన్, లబ్ధిదారుడు, గజ్వేల్