మనోహరాబాద్, జనవరి 12: “తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ వల్లనే., చావు నోట్లో తలపెట్టి ఆయన తెలంగాణను సాధించారు.” అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. అప్పటి కాంగ్రెస్, ఇతర పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నిజాయితీగా కొట్లాడలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. ఇంటింటికీ నల్లా నీళ్లు, పంట పొలాలకు కాల్వనీళ్లు తెచ్చుకుని అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఒకప్పటి తెలంగాణ అంటే పని దొరకక, వలసపోయే పరిస్థితి ఉండేదన్నారు. కానీ, కేసీఆర్ తెలంగాణ తెచ్చిన పదేండ్లలో రూపురేఖలు పూర్తిగా మార్చారన్నారు. 24 గంటల విద్యుత్, రూ.200 పింఛన్ రూ.2 వేలు, ఇంటింటికీ తాగునీళ్లు ఇచ్చి ఆడపడుచుల కష్టాలు తీర్చింది కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇచ్చామన్నారు. తూప్రాన్, గజ్వేల్లో దవాఖానలు నిర్మించి నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించింది కేసీఆర్ మాత్రమేనన్నారు. కొత్త మండలంగా మనోహరాబాద్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఇన్ని జిల్లాలు, మండలాలు వద్దని అంటున్నదని దుయ్యబట్టారు. మునుపటి లెక్క మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లేదన్నారు.
చేసిన అభివృద్ధికి అండగా ఉండి కేసీఆర్ను గెలిపించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకునేందుకు, మన గడాను రద్దు చేయడం, మనకు ఏమిచేయకుండా చేసేందుకు కుట్ర జరుగుతున్నదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే నిలదీస్తారన్నారు. జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ గొంతుక అంటేనే మన కేసీఆర్, మన బీఆర్ఎస్ అన్నారు. గెలుపు ఓటములు స్పీడు బ్రేకర్ లాంటిదని , మళ్లీ భవిష్యత్ మన చేతికే వస్తుందన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా అండగా ఉంటామని, అసెంబ్లీలో గొంతు విప్పుతామన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి,బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, ఎంపీపీలు పురం నవనీతారవి ముదిరాజ్, కల్లూరి హరికృష్ణ, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, కేసీఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్కుల మహిపాల్రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్, సర్పంచ్ నాయకుని రేఖామల్లేశ్ ముదిరాజ్, ఎంపీటీసీ స్వర్ణలతావెంకటేశ్, బీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, ఉపాధ్యక్షుడు రతన్లాల్, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, ఉప సర్పంచ్లు ధర్మేందర్, వెంకటేశ్, నాయకులు భాస్కర్, శేఖర్, సాయికుమార్, రాజు, నరేన్, కృష్ణ, ఎల్లేశ్, సత్యం, ప్రకాశ్, నర్సింహులు, జావీద్పాషా, ప్రవీణ్, గణేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని వేస్ట్ అయ్యాయి.. గెలుసుడు ఆలస్యమే లేదు కరెంట్ పోయిందని మనోహరాబాద్ మండలం జీడిపల్లికి చెందిన పెంటమ్మ ఎమ్మెల్యే హరీశ్రావుతో తన ఆవేదనను వ్యక్తం చేసింది. జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరైన ఆయన కాసేపు గ్రామ ఆడపడుచులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పెంటమ్మ కేసీఆర్ సారు ఉన్నప్పుడు అన్ని సక్రమంగా ఉండే. మంచిగ కరెంట్ వస్తుండే… పంటలు బాగా పండుతుండే ఇప్పుడు నాటేయకముందే కరెంట్ పోతున్నది,
ఆగమైపోయామని ఆవేదన వ్యక్తం చేసింది.