అందోల్, ఏప్రిల్ 16: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ను ఎంపీ ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా రైతుబంధు, రూ.2 లక్షల పంట రుణమాఫీ, కల్యాణలక్ష్మి, తులం బంగారం, ఆడ బిడ్డలకు ఇస్తామ రూ.2500 ఏమయ్యాయని గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలన్నారు. వంద రోజుల్లో అన్ని హామీలు అమలుచేస్తామని బాండ్లు రాసిచ్చిన ప్రభుత్వం ఏమైందన్నారు. కాంగ్రెస్ ఇచ్చినవన్నీ అమలుకాని హామీలని, రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలను సభలో స్క్రీన్లపై ప్రదర్శించడంతో ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిందన్నారు. మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రశ్నించే గొంతుకలు మన బీఆర్ఎస్ తరఫున పార్లమెంట్లో ఉండాలన్నారు. విద్యావంతుడు, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిని, మెదక్ నుంచి ఉద్యమకారుడు, ప్రజాసేవపై అంకితభావం కలిగిన గాలి అనిల్కుమార్ను జహీరాబాద్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ పదేండ్ల కాలంలో తెలంగాణను అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను, పరిపాలను గాలికొదిలేసిందన్నారు. పొద్దున లేసింది మొదలు ఇంటి ఎదుట ప్రత్యక్షమై మా పార్టీలో చేరండి అంటూ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని, ఇదీ ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా అంటూ ప్రశ్నించారు.
ఇలాంటి ఝూఠాకోర్ పార్టీని నమ్మితే తెలంగాణను ఎడారిగా మారుస్తుందన్నారు. రాష్ట్రం-లోని 42 లక్షల 80వేల మంది పెన్షన్దారులను బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిందని, ఈ ప్రభుత్వంపై చీటింగ్ కేసు పెట్టొద్దా అని అన్నారు. బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజల గుండెల మీద తన్నారని…ప్రజలను, రైతులను, కార్మికులను, యువతను, మహిళలను మోసం చేసిన పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెటాల్నా వద్దా అంటూ ప్రజలను హరీశ్రావు ప్రశ్నించడంతో బొందపెట్టాలి అంటూ చపట్లతో సభను మార్మోగించారు. బీజేపీ గురించి చెప్పేది ఏమీ లేదని, ఆ పార్టీకి ఓటేస్తే వృథాగా పోవడం తప్పా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మతం పేరుతో బీజేపీ, పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్ కాలం వెల్లదీస్తూ ప్రజా సమస్యలను గాలికొదిలేశాయని హరీశ్రావు విమర్శించారు. ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయక్వతమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ను ఆశీర్వదించి కేసీఆర్ను మద్దతుగా నిలవాలని హరీశ్రావు కోరారు. బీఆర్ఎస్ ప్రజలకు అండ అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ స్వార్థపరుడని, పార్టీ రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ఇప్పుడూ బీజేపీ పంచన చేరి వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం మరోసారి పోటీ చేస్తున్న అతడికి తగిన బుద్ధి చెప్పాలని పోచారం అన్నారు. జై తెలంగాణ అనని, అమరులకు నివాళులర్పించని ఏకైక సీఎం రేవంత్రెడ్డి అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు.