Neelam Madhu | సంగారెడ్డి మార్చి 28 (నమస్తే తెలంగాణ): మెదక్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేతలు బరిలో నిలిచి గెలిచిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ను అన్నీతానై శాసించిన ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా ప్రధానమంత్రి అయ్యారు. కాంగ్రెస్కు చెందిన ప్రముఖ నేతలు పి.హన్మంతరావు, సంగం లక్ష్మీబాయి, బాగారెడ్డి ఎంపీలుగా పోటీ చేసి గెలుపొందారు. బాగారెడ్డి వరుసగా నాలుగుసార్లు మెదక్ ఎంపీగా విజ యం సాధించారు. కాంగ్రెస్కు దిగ్గజ నేతలు పోటీ చేసిన మెదక్ పార్లమెంట్ నుంచి ఈసారి ఇందిరాగాంధీ వారసులు రాహుల్ లేదా ప్రియాంక పోటీ చేస్తారని కాంగ్రెస్ నేతలు ఆశించారు.
కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా చిట్కుల్ సర్పంచ్గా పనిచేసి ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధుకు మెదక్ ఎంపీ టికెట్ కట్టబెట్టింది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ సీనియర్లకు మింగుడు పడటం లేదు. మెదక్ ఎంపీ టికెట్ కోసం పలువురు సీనియర్ నాయకులు పోటీ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, నరేంద్రనాథ్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వీరిని కాదని కాంగ్రెస్ అధిష్టానం చిట్కుల్ సర్పంచ్గా పనిచేసిన నీలం మధుకు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వటం ఆశావహులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ముఖ్యంగా నీలం మధుకు టికెట్ ఇవ్వటం సంగారెడ్డి, మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతకు ఇష్టం లేదు. పార్టీ టికెట్ ఇచ్చినా జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్లు ఈ అభ్యర్థికి సహకరించే అవకాశాలు కనిపించటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ వందరోజుల పాలనలో హామీలు నిలబెట్టుకోక పోవటం కాంగ్రెస్ అభ్యర్థికి ప్రతికూలంగా మారనున్నది.
పటాన్చెరు నియోజకవర్గంలోని చిట్కుల్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నీలం మధు అంచలంచెలుగా మెదక్ ఎంపీ అభ్యర్థి స్థానానికి ఎదిగారు. బీసీ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నీలం మధు 2006లో చిట్కుల్ వార్డు మెంబర్గా, 2014లో ఉపసర్పంచ్గా పనిచేశారు. 2014లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో సర్పంచ్గా ఎన్నికయ్యారు. గతేడాది జరిగిన శాసనసభ సాధారణ ఎన్నికల సమయంలో నీలం మధు పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ సైతం టికెట్ ఇవ్వకపోవంతో బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి 46వేల ఓట్లు పొందారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తిరిగి ఆ పార్టీలో చేరారు. పటాన్చెరు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా మెదక్ ఎంపీ టికెట్ కట్టబెట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమేనన్న చర్చ సాగుతోంది. అయితే బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న మెదక్ పార్లమెంట్లో గెలవడం అంతా ఈజీకాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మధుకు నాయకులు, కార్యకర్తలు సపోర్టులేకపోతే గెలవడం కష్టమే.