నారాయణఖేడ్, అక్టోబర్ 28 : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి మోసపోవద్దని, ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, మేం పడుతున్న బాధలు మీరు పడొద్దని కర్ణాటక రైతులు తెలంగాణ ప్రజలతో మొరపెట్టుకున్నారు. శనివారం కర్ణాటకకు చెందిన రెండు వందల మంది రైతులు, మహిళలు జన జాగృతి యాత్ర పేరిట నారాయణఖేడ్లో భారీర్యాలీ నిర్వహించారు. మంగల్పేట్లోని భవానీ మందిర్ నుంచి రాజీవ్చౌక్ మీదుగా బసవేశ్వర చౌక్ వరకు ఫ్లకార్డులు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ పాదయాత్ర చేపట్టారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆ పార్టీని గెలిపిస్తే మాకుపట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. తెలంగాణలో ప్రజలు కోసం పనిచేసే పార్టీని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక రైతులు చేపట్టిన జనజాగృతి యాత్రపై నారాయణఖేడ్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కసు వెళ్లగక్కారు. ఒక్కసారిగా రైతుల ర్యాలీపైకి దూసుకొచ్చారు. రైతుల చేతిలోని ఫ్లకార్డులు, ఫ్లెక్సీలను లాక్కుని చించివేసి దాడికి యత్నించారు. పోలీసుల సహకారంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రైతుల ర్యాలీ కొనసాగింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోవద్దు, ఇటీవల కర్ణాటకలో ఆపార్టీ హామీలను విశ్వసించి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికొదిలేశారు.. ఇది సాక్షా త్తు కర్ణాటకకు చెందిన రైతులు, మహిళలు చెప్పిన నిజం. నారాయణఖేడ్లో శనివారం కర్ణాటకకు చెందిన సుమారు 200మంది రైతులు, మహిళలు జనజాగృతి పేరిట భారీర్యాలీ నిర్వహించారు. మంగల్పేట్లోని భవానీ ఆలయం నుంచి రాజీవ్చౌక్ మీదుగా బసవేశ్వరచౌక్ వరకు కాంగ్రెస్ విస్మరిం చిన హామీల ఫ్ల్లకార్డులు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ పాదయాత్ర చేపట్టారు. అనంతరం విలేకరుల సమావేశంలో బీదర్ జిల్లా రైతుసంఘం నాయకులు సంజీవ్కుమార్ టొళ్లే, దేవరాజ్గౌడ, పెనినగౌడ, సోమనాథ్ తదితరులు మాట్లాడారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు సక్రమంగా అమలుకు కావడం లేదన్నారు. 8 గంటల విద్యుత్ ఇస్తామని కేవలం రెండు గంటలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.
ప్రతి కుటుంబానికి నెలకు పది కిలోల బియ్యం ఇస్తామని, ఐదు కిలోలు ఇస్తుందని తెలిపారు. గృహలక్ష్మి పేరిట ప్రతి మహిళకు నెలకు రూ.2వేలు ఇస్తామని, ఇప్పుడు అనేక ఆంక్షలు పెట్టారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇంకా ప్రారంభించలేదన్నారు. కర్ణాటకలో తాము మోసపోయిన విధంగా తెలంగాణ ప్రజలు మోసపోవద్దనే ఉద్దేశంతోనే జనజాగృతి యాత్ర చేపట్టి జాగృతం చేస్తున్నామన్నారు.
రైతుల ర్యాలీపై కాంగ్రెస్ అక్కసు
కర్ణాటక రైతులు చేపట్టిన యాత్రపై కాంగ్రెస్ కార్యకర్తలు అక్కసు వెళ్లగక్కారు. మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి నివాసం వద్దకు ర్యాలీ చేరుకోగానే అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. రైతుల చేతిలోని ఫ్లకార్డులు, ఫ్లెక్సీలను లాక్కుని చించివేసి దౌర్జన్యం చేశారు. రాజీవ్చౌక్ వద్ద రైతు లపై దాడికి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.