సిద్దిపేట అర్బన్, జూన్ 2 : పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని, కాంగ్రెస్ పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల వద్ద గల బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ మేరకు ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కొత్త ప్రభాకర్రెడ్డి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, యువతకు దగ్గర అవుదామని రాజీవ్ యువ వికాసం పేరుతో డ్రామా మొదలు పెట్టారన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం వాయిదా వేయడమంటే ప్రభుత్వం సరిగ్గా పని చేయడం లేదని అర్థమవుతుందన్నారు. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడుపుతున్నాడా.. మంత్రులు నడుపుతున్నారా.. లేక ఎమ్మెల్యేలు నడుపుతున్నారా అర్థంకాని పరిస్థితి ఉందన్నారు.
ఎంతో మంది యువత ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ నాయకులు మాత్రమే తీసుకుంటున్నారని, ఇందిరమ్మ ఇండ్లు చిన్నగా ఉండటంతో ప్రజలు తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ వాళ్లకు దమ్ము, ధైర్యం ఉంటే బీఆర్ఎస్ నాయకులతో పోరాటం చేయాలి కానీ, ప్రజలను మోసం చేయకూడదన్నారు. మీకు చేతకాకపోతే మమ్ముల్ని సూచనలు అడగండి.. లేదంటే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని తెచ్చుకోవాలని ధ్వజమెత్తారు.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ఆదేశాలతో 14 సంవత్సరాలు సుధీర్ఘ పోరాటం చేసిన ఘనత సిద్దిపేట గడ్డకే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసేలా నిరంతరం పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజులా రాజనర్సు, బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, రణం శ్రీనివాస్, వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.