Congress | సిద్దిపేట, మార్చి 28( నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికార కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది. పార్టీ అభ్యర్థిగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధును ప్రకటించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి తారాస్థాయికి చేరుకుంది. పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులకు కాకుండా ఇవ్వాళ పార్టీలోకి వచ్చిన నేతలకు ఎలా టికెట్ ఇస్తారంటూ, పార్టీ అధిష్టానంపై నేతలు మండి పడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన నేతలకు గుర్తింపు లేకుండా పోయిందని ఆ పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ ప్రకటించిన అభ్యర్థి కోసం పని చేసేది లేదంటూ కొంతమంది నేతలు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వర్గాలుగా చీలిపోయింది. దీంతో పార్టీ కార్యకర్తలు ఏ వర్గం కింద పనిచేయాలో అర్థంకాక ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. ఏడు శాసనసభ స్థానాలకు గానూ ఒక మెదక్ అసెంబ్లీ మినహా, అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం అంత ఈజీకాదు. పైగా మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కంచుకోట.
కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి దామోదర రాజనర్సింహను నియమించింది. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహల గ్రూపులు జిల్లాలో కొనసాగుతున్నాయి. దీంతో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. దీంతో అభ్యర్థి ప్రకటనతో పార్టీలో అసమ్మతి బయట పడింది. గత శాసన సభ ఎన్నికల్లో పటాన్చెరు కాంగ్రెస్ అభ్యర్థి కాటం శ్రీనివాస్గౌడ్ ఓడిపోవడానికి ప్రధాన కారకుడైన నీలం మధుకు టికెట్ ఎలా ఇస్తారని పటాన్చెరువు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఆ రోజు తొలుత పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధును ప్రకటించిన అధిష్టానం తీరుకు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నియోజకవర్గం వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. చివరకు గాంధీభవన్లో పెద్ద రభసే చేశారు. ఆరోజు మంత్రి దామోదర రాజనర్సింహ కలుగజేసుకొని పార్టీ అధిష్టానంతో మాట్లాడి పటాన్చెరు అభ్యర్థిని మార్పించారు. తన ముఖ్య అనుచరుడైన కాటం శ్రీనివాస్గౌడ్కు టికెట్ ఇప్పించుకున్నారు.
దీంతో నీలం మధు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరి ఆ పార్టీ టికెట్పై పోటీ చేశారు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపకుండా ఇతర పార్టీలో చేరి శ్రీనివాస్గౌడ్ను ఓడగొట్టిన ప్రస్తుత మెదక్ పార్లమెంట్ అభ్యర్థికి ఎలా ప్రచారం చేస్తామంటూ ఆ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో టికెట్ తెచ్చుకున్న నీలం మధుకు పార్టీ క్యాడర్ అంతగా సహకరించే అవకాశాలు లేవని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో రకరకాల పేర్లు వినిపించాయి. మాజీఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతోపాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేదా ఆయన సతీమణి నిర్మల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. మరోవైపు ఇతర పార్టీల నుంచి చేర్చుకొని వారికి టికెట్ ఇస్తారని ప్రచారం చేశారు. ఇతర పార్టీల్లోని ఒక నేత కోసం ఒక వర్గం తీవ్రంగానే ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ కేంద్రంగా చివరివరకు లాబీయింగ్ చేసినట్లు సమాచారం. మాజీఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మెదక్ నుంచి పోటీ చేస్తున్నానని, తనకే టికెట్ వస్తుందని మెదక్ పార్లమెంట్ పరిధిలో హల్చల్ చేశారు.
ఇతర పార్టీల నేతల వద్దకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని కోరారు. ఆయన మాటలను ఎవ్వరు కూడా విశ్వసించలేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి హన్మంతరావుకు మొండి చేయి చూపింది. ఇటీవల సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మైనంపల్లి ఇతర నేతలు హాజరవుతారని ప్రచారం చేశారు. కానీ మైనంపల్లి చేష్టలతో మంత్రి పొన్నం ప్రభాకర్ గైర్హాజరయ్యారు. ఒకింత మైనంపల్లి హన్మంతరావుపై అసంతృప్తిగానే మంత్రి ఉన్నట్లు సమాచారం. ఇలా ఒకరి కంటే ఒకరు జిల్లాలో పెత్తానం చెలాయించాలని చూస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్దిరోజులుగా నియోజకవర్గానికి రావడం లేదు. కార్పొరేషన్ ఇతర పదవుల పైరవీల్లోనే ఉన్నట్లు సమాచారం. ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్ల పదవుల పంపిణీపై అసమ్మతి రాజుకుంటుంది. నంగునూరు మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు కొట్లాటకు దిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంఘటన చూశాం. నిన్నటికి నిన్న స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మికి కనీస మర్యాద ఇవ్వలేదని బోరున విలిపించిన సంగతి తెలిసిందే. పార్టీలో పనిచేసే నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటి మెదక్లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకడుతుందా..? అని ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారు.