చేర్యాల, ఏప్రిల్ 18: ఏండ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ పటిష్టం కోసం పని చేసిన నాయకులను, కార్యకర్తలను చేర్యాల ప్రాంతంలో పార్టీ పెద్దలు దూరం పెడుతున్నారని, పదవులు ఇవ్వడం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. చేర్యాల మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు ఆధ్వర్యంలో చేర్యాల, కొమురవెల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురువారం హైదరాబాద్లో మంత్రి కోమటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమంది పార్టీలో చేరారని, అలాంటి వారికి నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయవద్దని కోరారు. ఇటీవల పార్టీలో చేరిన కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారని, ఏండ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తానని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఖాజా, నాయకులు ఎలుగల దుర్గయ్య, బొడిగం నర్సిరెడ్డి, ఎండీ జహంగీర్ తదితరులు ఉన్నారు.