న్యాల్కల్, మార్చి 24 : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని, 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ విమర్శించారు. ఆదివారం మండలంలోని న్యామతాబాద్ గ్రామ శివారులోని సన్రైజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 100 రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని విమర్శించారు. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. పదేండ్లలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నరేంద్రమోడీ ఎంతో కృషిచేశారన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనను మరో సారి ఎంపీగా గెలిపిస్తే జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పలు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు పాండురంగారెడ్డి, పాండురంగారావు పాటిల్, మల్లప్పపాటిల్, శ్రీనివాస్రెడ్డి, సిద్దారెడి తదితరులు బీజేపీలో చేరారు. సమావేశంలో పార్టీ నాయకులు ఓంకార్ యాదవ్, మల్లేశం, ఏక్నాథ్ పాటిల్, ఈరన్న, బస్వరాజ్ పాటిల్, విద్యాసాగర్ పాటిల్, దేశెట్టి పాటిల్, సుధీర్ బండారీ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.