అందోల్, ఏప్రిల్ 1: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని విధంగా తయారైంది సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిర్మించిన రైతుబజార్ పరిస్థితి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయలు విక్రయించుకునేందుకు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబజార్ నిర్మించింది. ఇందులో అందోల్-జోగిపేటతో పాటు పరిసర ప్రాంతాల రైతులు కూరగాయలు విక్రయించుకునేందుకు షెటర్లు, షెడ్లు నిర్మించింది. రూ. 1.20 కోట్లతో నిర్మించిన రైతుబజార్లో 15 దుకాణసముదాయాలు, వ్యాపారులు కూర్చుని కూరగాయలు విక్రయించేందుకు షెడ్లు నిర్మించడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించారు.
అప్పటి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత వ్యాపారులు కొద్ది రోజులు కూరగాయలు విక్రయించారు. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు దీన్ని తమ రాజకీయాలకు వాడుకున్నారు. కొంతమంది వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించి రైతులు కూరగాయలు విక్రయించకుండా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఎన్నిసార్లు రైతుబజార్లో రైతులు కూరగాయలు విక్రయించుకునేలా చేసినా ఫలితం కనిపించలేదు. కొద్ది రోజుల తర్వాత పక్కనే వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మించి రెండూ ఒకేసారి వినియోగంలోకి తీసుకురావాలని పనులు ప్రారంభించారు.
అసెంబ్లీ ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. వెజ్-నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో రైతుబజార్ను పట్టించుకునేవారు కరువయ్యారు. చెత్తాచెదారం, ముళ్లపొదలతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇది మున్సిపల్ కార్యాలయానికి ముందే ఉంది. మున్సిపల్ వాహనాలు పార్కింగ్ చేయడం పరిపాటిగా మారింది. ఓ వైపు రూ. కోట్లు ఖర్చుచేసి నిర్మించిన రైతుబజార్ వృథాగా మారింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుతుండగా..మరో వైపు రైతులు, వ్యాపారులు ఎండ, వానకు ఇబ్బందులు పడుతూ కూరగాయలు విక్రయిస్తున్నారు.
రైతుబజార్ను అక్కడ కొనసాగించడం ఇష్టంలేకపోతే ఎవరికైనా నెలవారి అద్దెకు దుకాణాలు ఇస్తే మార్కెట్కు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. కొద్ది రోజుల క్రితం దీనిని మున్సిపల్కు అప్పగించాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించగా, అది కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఉన్న రైతుబజార్ను పడగొట్టి దాని స్థానంలో టౌన్హాల్ నిర్మించనున్నట్లు పట్టణంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతుబజార్ను వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.