సిద్దిపేట కమాన్, ఏప్రిల్ 13: బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట నియోజకవర్గానికి మంజూరైన రోడ్ల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆర్అండ్బీ ఎస్ఈ, ఈఈ, ఏఈలతో పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త రోడ్డు పని చేపట్టింది లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లు అసంపూర్తిగా ఆగిపోయి మోకాలు లోతు గుంతలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
అధికారులు వెంటనే చొరవ చూపి రోడ్ల పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. సిద్దిపేట రింగ్రోడ్డు పనులు 80శాతం పూర్తి అయ్యాయని, మిగతా 20శాతం గుంతలమయంగా మారి రాత్రిపూట ప్రమాదాలు ఎక్కువగా జరిగి చనిపోతున్నారని అన్నారు. పాలమాకుల, విఠలాపూర్ గ్రామాల వద్ద పనులు కాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రింగ్రోడ్ పనులు పూర్తి చేయాలని కోరారు. సిద్దిపేట నుంచి చిన్నకోడూరు మండల కేంద్రం మీదుగా ఇల్లంతకుంట వరకు ఫోర్లైన్ రోడ్డు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరై 70శాతం వరకు పూర్తయిందన్నారు. కాంగ్రెస్ వచ్చిన నుంచి తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. ప్రజలు దుమ్ము, ధూళి, ప్రమాదాలతో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఎల్లమ్మగుడి వద్ద, లింగారెడ్డిపల్లి గ్రామం వద్ద చిన్నకోడూరు చౌడారం జంక్షన్ వద్ద గుంతలమయంగా మారిందన్నారు. సిద్దిపేట-ఇల్లంతకుంట రోడ్డుపై దృష్టి పెట్టి చొరవ చూపాలన్నారు. రామంచ-సిరిసిల్ల రోడ్డు పనులు జరగక రోడ్డు ఇబ్బందిగా మారిందని, పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. బుస్సాపూర్,ఇరోడ్, రాంపూర్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. నంగునూర్ మండలంలో సీఆర్ఎఫ్ నిధులతో ముండ్రాయి-ఆంక్షాపూర్, నాగరాజుపల్లి రోడ్డు పనులు 70శాతం పూర్తయిందన్నారు. బీటీ ఫైనల్ లేయర్ పనులు రెండేండ్లుగా ఆగిపోయాయన్నారు. పూర్తి చేయాలని కోరారు. దర్గపల్లి బ్రిడ్జ్ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు.