నర్సాపూర్: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి (MLA Sunitha Laxma Reddy ) అన్నారు. గజ్వేల్లో మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ( KCR Camp Office ) పై కాంగ్రెస్ శ్రేణులు ( Congress ) దాడి చేసిన ఘటననను ఆమె తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ప్రజల సమస్యలు వినిపించుకునే ప్రదేశాలపై దాడులు జరగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. దాడులు, విధ్వంసాలు పెరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు.
రాష్ట్రాన్ని దశాబ్ద కాలంగా సమర్థవంతంగా పరిపాలించిన మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పోలీసులు తక్షణమే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.