సిద్దిపేట రూరల్, ఫిబ్రవరి 11 : కాంగ్రెస్ ప్రభుత్వం అర్చకులకు కనీసం జీతాలు ఇవ్వడం లేదని, రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు బండ స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణ మండపంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రూ.3 కోట్లతో ఆలయ అభివృద్ధికి వివిధ పనులు చేశామన్నారు. ఆలయానికి భక్తులు వచ్చేందుకు రూ.35 లక్షలతో రోడ్డు , రూ.35 లక్షల టీటీడీ నిధులతో దేవాలయ అభివృద్ధి పనులు,రూ.10 లక్షలతో దేవాలయం చుట్టూ షెడ్ నిర్మించామని తెలిపారు.
బండపై తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం రూ.80 లక్షలతో, మిషన్ భగీరథ పథకంలో భాగంగా లక్షా 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకును నిర్మించామని తెలిపారు. రూ.50 లక్షలతో కల్యాణమండపం, ఆలయం సమీపంలో భక్తులు సేదతీరేందుకు సుడా ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో పార్కు నిర్మాణం చేయించామని, మరో రూ.8 లక్షలతో మినీట్యాంకులు, పైప్లైన్లు, నల్లాలు ఏర్పాటు చేయించామని, సీసీ రోడ్డు గుండా రూ.10 లక్షలతో విద్యుత్ స్తంభాలు, పుల్లూరు స్టేజీ వద్ద సుమారు రూ.15 లక్షలతో దేవాలయ స్వాగత తోరణం, మరో రూ.50 లక్షలు మంజూరు చేయించామని, వాటితో భక్తులకోసం ధర్మశాలలు నిర్మిస్తామని తెలిపారు. పుల్లూరు మీదుగా రింగ్రోడ్డు వేసుకున్నామని, దీనికి అనుసంధానంగా డబుల్రోడ్డు పనులు సాగుతున్నాయని హరీశ్రావు తెలిపారు. బండచెర్లపల్లి చెరువుకు నీళ్లు రానున్నాయని, పుల్లూరు, వెంకటయ్యకుంట చెరువులు నింపుతామని, కాళేశ్వరం జలాలు రెండు పంటలు పండుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 2500 ఆలయాలకు, సిద్దిపేట జిల్లాలోని 171 ఆలయాల అర్చకులకు జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటునట్లు తెలిపారు. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు. పుల్లూరు బండ ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కనకయ్యగౌడ్, మాజీ చైర్మన్ కలకుంట్ల రంగాచార్యులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, సుడామాజీ చైర్మన్ రవీందర్రెడ్డి, ఎంపీపీ శ్రీదేవీరాంచందర్రావు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ పల్లె నరేశ్గౌడ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.