చిన్నకోడూర్, ఏప్రిల్ 21: కేసీఆర్ ఉన్నప్పుడు గిట్ల ఉండేనా..రైతులు అధైర్యపడొద్దు. తొందరపడి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దు. రూ. 2,203 మద్దతు ధర ఇప్పిస్తా.. అధికారులతో మాట్లాడి అండగా ఉంటానని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రైతులకు స్పష్టం చేశారు. చిన్నకోడూరు మండలం పెద్దకోడూర్ గ్రామ పరిధిలోని మెట్టుబండల వద్ద కొనుగోలు కేంద్రా న్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలన్నారు. 15 రోజుల నుంచి వడ్లు పెట్టుకొని ఇక్కడే ఉంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. రైతులు 15 రోజులుగా కేంద్రంలో ధాన్యం ఉంచినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. వర్షంతో ధాన్యం తడిచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే మద్దతుధరకు ధాన్యం కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి కష్టాలు లేవని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇటు కరెంటు అటు నీళ్లు లేక పంటలు ఎండిపోయినట్లు తెలిపారు. మోటార్లు కాలిపోవడంతో రైతులకు పెనుభారంగా తయారైందన్నారు. చాలామంది రైతులకు రైతుబంధు పడలేదన్నారు. ప్రభుత్వం రైతులను అసలు పట్టించుకోవడమే లేదని హరీశ్రావు అన్నారు.
* రైతు రగునవ్వ మాట్లాడుతూ..15 రోజుల నుంచి ఇక్కన్నే ఉంటున్నం సార్… వడ్లు కొనే నాథుడే లేడు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్ని ఇచ్చిండు… ఇప్పుడు ఏం లేదు…అసలు రైతులను పట్టించుకోవడమే లేదు…
* రైతు మోహన్రెడ్డి మాట్లాడుతూ… కరెంట్ తిప్పలతో రెండుసార్లు మోటార్ కాలిపోయి రూ.22 వేలు ఖర్చు అయింది. రైతుబంధు కాదు.. ఏదీ లేదు సార్.. మాకు తిప్పలు అయితంది. కేసీఆర్ పెద్దమనిషి ఉన్నప్పుడు అన్ని ఉండే సార్… ఆ సారే మల్ల రావాలి సార్…!!
* రైతు నారాయణస్వామి మాట్లాడు తూ… వడ్లు కొనక చాలా తిప్పలు అవుతుంది సార్.. 15 రోజులు అయినా వడ్లు కొంటలేరు… కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గీ బాధలు అస్సలే లేవు సర్…!! గీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ తిప్పలే..
* హరీశ్రావు మాట్లాడుతూ… రైతు రుణమాఫీ రూ. 2లక్షలు అన్నాడు ఇయ్యలే.. రైతుబంధు అన్నాడు ఇయ్యలే.. వడ్లకు బోనస్ రూ.500 అన్నాడు ఎగొట్టిం డు.. అస్సలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మొద్దు… కేసీఆర్ హయాంలో గిట్ల ఉండేనా..అన్నీ రైతుల ముంగిటొచ్చినయ్ అని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాలను వారికి వివరించారు.