Congress-BJP | కాంగ్రెస్, బీజేపీని రెబెల్స్ భయం వెన్నాడుతున్నది. ఎమ్మెల్యే టికెట్ ఆశించి దక్కని నేతలు రెబెల్స్గా బరిలో దిగుతారన్న భయాందోళనలు ఆయా పార్టీల పెద్దల్లో నెలకొంది. టికెట్ రాని ఆశావహులు, పార్టీలో ప్రాధాన్యం దక్కని నేతలు కోవర్టులుగా మారి పార్టీకి నష్టం చేకూరుస్తారన్న భయం కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఆర్ఎస్ బీఫామ్లను అందజేయడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించ లేదు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వరుస ఓటములను చవిచూసింది. దీంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవోలా మారాయి. బలమైన అభ్యర్థులు బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నా.. పరిస్థితులు అనుకూలించడం లేదు. బీజేపీ తొలి జాబితాను రెండురోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలోని అందోలు మినహా మిగతా అభ్యర్థులను తొలిజాబితాలో ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ ఐదుస్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా రెబెల్స్ భయం పీడించే అవకాశం ఉంది.
సంగారెడ్డి అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలు ఇంకా పూర్తిగా అభ్యర్థులను ప్రకటించ లేదు. అభ్యర్థుల ప్రకటనకు ముందే రెండు పార్టీల్లో రెబెల్స్ భయం వెన్నాడుతున్నది. ఎమ్మెల్యే టికెట్ ఆశించి దక్కని నేతలు రెబెల్స్గా బరిలో దిగుతారన్న అనుమానాలు కాంగ్రెస్, బీజేపీ పెద్దల్లో నెలకొంది. టికెట్ రాని ఆశావహులు, పార్టీలో ప్రాధాన్యం దక్కని నేతలు కోవర్టులుగా మారి పార్టీకి నష్టం చేకూరుస్తారన్న భయం రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది. బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతోపాటు బీఫామ్లను అందజేసింది. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించ లేదు. కాంగ్రెస్ పార్టీ తొలిజాబితాలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించింది. కాంగ్రెస్ తొలి జాబితాలో టికెట్ ఆశించిన నేతలు పార్టీ తమకు టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. టికెట్ రాని కొంతమంది ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా పోటీ చేసే యోచనలో ఉన్నారు. బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించం లేదు. రెండురోజుల్లో బీజేపీ అధిష్టానం తొలిజాబితాను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ టికెట్ ఆశిస్తున్న నేతలుతొలి, మలి జాబితాలో తమ పేర్లు లేనిపక్షంలో స్వతంత్రంగా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో రెబెల్స్ గుబులు వెన్నాడుతున్నది.
సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వరుస ఓటములను చవిచూసింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవోలా మారాయి. బలమైన అభ్యర్థులు బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నా పరిస్థితులు అనుకూలించడం లేదు. కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న తీరులో మార్పు రావటం లేదన్న అసంతృప్తి సొంత పార్టీ నేతల్లో కనిపిస్తున్నది. కాంగ్రెస్ తొలిజాబితాలో దామోదర్(అందోలు), జగ్గారెడ్డి(సంగారెడ్డి), చంద్రశేఖర్(జహీరాబాద్) ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. నారాయణఖేడ్, పటాన్చెరు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అందోలు నుంచి టికెట్ కేటాయించిన దామోదర్ రాజనర్సింహపై స్థానిక నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. దామోదర్ ప్రజాబలం లేక వరుస ఓటమిపాలవుతున్నా అధిష్టానం స్థానిక నేతలను పక్కనబెట్టి ఆయనకే టికెట్ కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఇక్కడ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేతలు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డిలో మరోమారు జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్రెడ్డి, సంగమేశ్వర్ టికెట్ ఆశించారు. ఇద్దరికి టికెట్ రాకపోవడంతో వీరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
వీరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎన్నికల్లో పనిచేయకపోవచ్చన ప్రచారం కాంగ్రెస్ పార్టీ నేతల్లో సాగుతుంది. ఇదిలాఉంటే కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన స్థానికేతరుడైన మైనార్టీ నేత ముకీమ్ ఇండిపెండెంట్గా పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంతో సంబంధంలేని, స్థానికంగా నివాసం ఉండని చంద్రశేఖర్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి ఉంది. టికెట్ దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగానే బీఆర్ఎస్లో చేరుతున్నారు. టికెట్ ఆశించిన భంగపడ్డ కాంగ్రెస్ నాయకులు నర్సింహులు, గోపాల్ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగటంపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నారాయణఖేడ్లో ఎమ్మెల్యే టికెట్ కోసం సురేశ్ షెట్కార్, సంజీవరెడ్డి ఎవరికివారే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కినా మరొకరు ఇండిపెండెంట్గా లేదా ఇతర పార్టీ గుర్తుపై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం గాలి అనిల్కుమార్, కాటా శ్రీనివాస్గౌడ్ పోటీ పడుతున్నారు. ఇక్కడా ఎవరికి టికెట్ దక్కకపోయినా మరొకరు బరిలో దిగేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ గుబులు వెన్నాడుతున్నది. దీనికితోడు పార్టీలో ప్రాధాన్యం దక్కని ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తితో పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తే ఎలా అన్న భయం కాంగ్రెస్లో ఉన్నది.
బీజేపీ తొలి జాబితాను రెండురోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలోని అందోలు మినహా మిగతా అభ్యర్థులను తొలిజాబితాలో ప్రకటించే అవకాశం కనిపించటం లేదు. ఒకవేళ ఐదుస్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా పార్టీకి రెబెల్స్ భయం పట్టుకుంది. సంగారెడ్డి అసెంబ్లీలో దేశ్పాండే, పులిమామిడిరాజు, శివరాజ్పాటిల్ ప్రధానంగా ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీపడుతున్నారు. వీరిలో ఎవరికి టికెట్ దక్కినా మిగతా ఇద్దరు రెబెల్గా మారే అవకాశాలు ఉన్నాయి. పటాన్చెరులో నందీశ్వర్ గౌడ్, అంజిరెడ్డి, శ్రీకాంత్గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ ఎవరికి టికెట్ వచ్చినా మిగితా ఇద్దరు సహకరించే పరిస్థితి లేదు. అందోలులో బాబూమోహన్కు టికెట్ ప్రకటిస్తే ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న బాలయ్య రెబెల్గా బరిలో దిగటం లేదా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. నారాయణఖేడ్లో విజయ్పాల్రెడ్డి, సంగప్ప, సంగ్రాం మహారాజ్ ఎవరికివారే టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి టికెట్ దక్కినా మిగతా ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థికి సహకరించే అవకాశాలు లేవు.