మిరుదొడ్డి, మే 29 : గత పాలకుల నిర్లక్ష్యంతో సరైన రహదారులు, కంకర తేలిన రోడ్లతో ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రెండు లేన్ల బీటీ రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి నిధులు వెచ్చించింది.
మండల కేంద్రమైన మిరుదొడ్డి టౌన్-లింగుపల్లి గ్రామాల మధ్య ఉన్న కూడవెల్లి వాగుపై పురాతన బ్రిడ్జికి ఇరువైపులా మూలమలుపులు ప్రమాదకరంగా ఉండేవి. మూలమలుపులతో ప్రమాదాలు జరిగి వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటనలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభు త్వం కంకర తేలిన రోడ్లను రెండు లేన్ల బీటీ రహదారులుగా మార్చడానికి నిధులు మంజూరు చేసింది. మిరుదొడ్డి శివారులోని కూడవెల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణాన్ని రోడ్డు భవనాల శాఖ నుంచి రూ.4కోట్ల నిధులతో చేపట్టింది.
హై లెవల్ బ్రిడ్జితో సాఫీగా ప్రయాణం..
రూ.4కోట్ల నిధులతో కూడవెల్లి వాగుపై నూతన హై లెవల్ బ్రిడ్జిని నిర్మాణ పనులు పూర్తికావడంతో ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు సాఫీగా రాకపోకలు సాగిస్తున్నారు. ఎన్నో ప్రమాదాలకు కారణమైన పురాతన బ్రిడ్జి నేడు వెలవెలబోతున్నది.
పురాతన బ్రిడ్జితో వానకాలంలో ప్రజలకు ఇబ్బందులు..
సికింద్రాబాద్ నుంచి గజ్వేల్-మిరుదొడ్డి మీదుగా దుబ్బాక, కామారెడ్డికి, సిద్దిపేటతోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పురాతన బ్రిడ్జితో ఇబ్బందులు పడేవారు. భారీ వర్షాలకు వరద నీరు బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తే ప్రయాణిలకు రాకపోకలు నిలిచిపోయేవి. అత్యవసర పరిస్థితుల్లో చెప్యాల, వీరారెడ్డిపల్లి, ఖాజీపూర్, భూంపల్లి, అక్బర్పేట మీదుగా సుమారు 15కిలో మీట్ల దూరం వరకు అదనంగా ప్రజలు ప్రయాణం చేసేవారు. దీంతో మిరుదొడ్డి, దుబ్బాక, కామారెడ్డి సిద్దిపేటతో పాటు ఆయా గ్రామాల మీదుగా ప్రజలు గమ్యస్థానాలకు చేరుకునేవారు.
భారీవర్షాలు కురిసినా భయం లేదు..
వానకాలంలో భారీ వర్షాలు కురిసినా నూతన హై లెవల్ బ్రిడ్జి పైనుంచి సాఫీగా ప్రయాణాలు కొనసాగిస్తున్నామని ప్రజలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా కూడవెల్లి వాగుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. దీంతో ప్రభుత్వం హై లెవల్ బ్రిడ్జిని నిర్మించి మా కష్టాలను తీర్చిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికు ప్రజలు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.