మెదక్ మున్సిపాలిటీ, జనవరి 6: మెదక్ కలెక్టరేట్ పనులు తొందరగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులకు మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్ ఆదేశించారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలో విద్య, ఆరోగ్యంపై 4వ సాయీ సంఘ సమావేశం, పనులపై 7వ స్థాయీ సంఘ సమావేశం జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాల శాఖను సమీక్షిస్తూ కలెక్టరేట్ పనులు ఎంతవరకు వచ్చాయని ఆర్అండ్బీ అధికారులను అడుగగా.. పనులు తుది దశకు చేరుకున్నాయని, రెండో అంతస్తులో సీలిం గ్ పనులు జరుగుతున్నాయని డీఈ వెంకటేశం తెలిపారు. ప్రహరీ, సీసీ రోడ్లకు మంజూరైన రూ.9 కోట్ల పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. మనోహరాబాద్ ఆర్అండ్బీ అతిథి గృహానికి ఎప్పుడూ తాళం వేసే ఉంటుందని, చేగుంట అతిథి గృహం కంపు కొడుతున్నదని, చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్, నార్సింగి జడ్పీటీసీ కృష్ణారెడ్డి డీఈకి సూచించారు.
నార్సింగి-మిర్జాపల్లి బ్రిడ్జి అసంపూర్తిగా ఉందని, చర్యలు తీసుకోవాలని కృష్ణారెడ్డి డీఈకి సూచించారు. మనోహరాబాద్తో పాటు రామాయిపల్లి డబుల్ బెడ్రూంల్లో భగీరథ నీరు రావడం లేదని, చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ ఈఈ కమలాకర్ను ఆదేశించారు. నార్సింగిలో విద్యుత్తు స్తంభాల ఏర్పాటులో సిబ్బంది ఆలసత్వం వహిస్తున్నదని జడ్పీటీసీ కృష్ణారెడ్డి విద్యుత్తు అధికారుల దృష్టికి తెచ్చారు. జిల్లాలో 97 నూతన గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు మంజూరైనట్లు పీఆర్ ఈఈ తెలిపారు. బీటీ రోడ్ల రెన్యూవల్కూ నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. తూప్రాన్ మండలంలో టెండర్లు పూర్తైనా, పలు గ్రామాల్లో పనులు ప్రారంభం కాలేదని, చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ ఈఈకి సూచించారు. సమావేశాల్లో జడ్పీ సీఈవో శైలేశ్, జడ్పీటీసీ సౌందర్య, ఆయా శాఖాల అధికారులు పాల్గొన్నారు.