సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 13: చివరి లబ్ధిదారుడికీ సాయం అందే వరకు ఈ పథకం కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూలైలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 300 మంది బీసీలకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి బీసీ కుల వృత్తులకు ఆర్థిక సాయం కింద రూ.లక్ష చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.
బీసీ కులవృత్తులను సంరక్షించేందుకు సీఏం కేసీఆర్ రాష్ట్రంలో చర్యలు తీసుకున్నారన్నారు. కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వారికి ప్రోత్సాహం అందిస్తే ఆర్థికంగా ఎదుగుతారనే ఉద్దేశంతో రూ.లక్ష గ్రాంట్ అందించాలని సీఎం నిర్ణయించారన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ బీసీ కులవృత్తుల ఆర్థిక సాయం పథకం కింద దరఖాస్తు చేసుకున్న 5.28 లక్షల అభ్యర్థుల్లో 15 కులవృత్తులు, చేతి వృత్తుల వారికి మొదటి ప్రాధాన్యత కల్పించాలన్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో రూ.లక్ష ఆర్థిక సాయం కోసం 20,894 దరఖాస్తులు వచ్చాయని, ప్రాధాన్యతాపరంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.