సంగారెడ్డి, డిసెంబర్ 28: సంగారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ శరత్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పాఠ్యాంశాలపై పట్టు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, వెనుకబడిన వారిని గుర్తించి అదనంగా తరగతులు తీసుకోవాలన్నారు.
పాఠ్యాంశాల వారీగా ప్రశ్నావళి తయారు చేసి చర్యలు తీసుకొకోవాలన్నారు. సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వాలన్నారు. రోజూ ఉదయం, సాయం త్రం ఒక షెడ్యూల్ మేరకు బోధన చేయాలన్నారు. జనవరి మొదటి వారంలో స్టడీ మెటీరియల్ కాపీలు తయారు చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టంచేశారు. ఈ నెల 31లోగా సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డీఈవో రాజేశ్, జిల్లా ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి లింబాజీ, నారాయణఖేడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
– సంగారెడ్డి కలెక్టర్ శరత్