తిరుపతి : తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారం అలిపిరి చెక్పాయింట్ వద్ద బంగారం బ్యాగు ( Gold Bag ) ను మరిచిపోయిన భక్తుడికి టీటీడీ ( TTD ) తిరిగి అప్పగించింది. భద్రతా తనిఖీల సందర్భంగా హైదరాబాద్ ( Hyderabad )కు చెందిన మహేష్ అనే భక్తుడు అనుకోకుండా బ్యాగును అక్కడే మరిచిపోయాడు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆ బ్యాగును ఆధీనంలోకి తీసుకుని పరిశీలించగా, అందులో సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి మహేష్కు చెందిన బ్యాగుగా గుర్తించారు. అప్పటికే తాను బ్యాగును మరిచిపోయిన విషయాన్ని కూడా గుర్తించని భక్తుడిని వెంటనే కార్యాలయానికి పిలిపించి, పూర్తి వివరాలను ధృవీకరించిన అనంతరం బ్యాగును భద్రంగా అప్పగించారు. టీటీడీ యాజమాన్యానికి, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీ, అప్రమత్తత, సేవాభావాన్ని భక్తుడు మహేష్ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.