పటాన్చెరు ఏరియా దవాఖానను సంగారెడ్డి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇద్దరు వైద్యులు విధులకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్లు ఇబ్బందులు పడకుండా చూడాలంటూ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
– పటాన్చెరు, మే 2
పటాన్చెరు, మే 2: పటాన్చెరు ఏరియా దవాఖానను మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానలో ఇద్దరు డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించిన కలెక్టర్, వారి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని దవాఖాన ఇన్చార్జి డాక్టర్ శ్రీనివాస్ను ఆదేశించారు. అనంతరం దవాఖానలోని పలు విభాగాలను పరిశీలించారు. దవాఖానకు వస్తున్న పేషెంట్లు వివిధ విభాగాలను తెలిగ్గా గుర్తించేలా సైన్బోర్డులు పెట్టాలని సూచించారు.
ఓపీలో వచ్చిన రోగులు త్వరగా డాక్టర్లను కలిసేలా మార్కింగ్ బోర్డులు ఉండాలని చెప్పారు. డాక్టర్ల వద్ద చూపించుకుంటున్న పేషెంట్లకు ప్రైవసీ ఉండేలా కర్టెన్స్ ఉపయోగించాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందజేసే బాధ్యత మనపై ఉందని డాక్టర్లతో కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు పేషెంట్లతో కలెక్టర్ మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల రివ్యూ ప్రిపరేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఓటర్ లిస్టుల తయారీ, ఇతర అంశాలను తహసీల్దార్ పరమేశాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మెంచు నగేశ్, వివిధ మండలాల తహసీల్దార్ ఉన్నారు.