కొల్చారం, మార్చి 24: మెదక్ జిల్లాలో 41 టీంలతో అన్ని శాఖల సమన్వయంతో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం కొల్చారం మండలం వరిగుంతంలో కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజు సరాసరి 150కి పైగా కంటి పరీక్షలు చేయాలని లక్ష్యం కాగా, ప్రజలను మొబిలైజేషన్ చేస్తూ అంతకుమించి పరీక్షలు చేస్తుండడం సంతోషం వ్యక్తం చేశారు. కంటి పరీక్షలు చేస్తున్న తీరు, రికార్డులు, అద్దాల పంపిణీ పరిశీలించి, వైద్యాధికారులతో శిబిరం నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.
నేటితో శిబిరం ముగియనున్నందున ఇంకా మిగిలి ఉన్న వారందరికీ కంటి పరీక్షలు చేయించేలా ఆశ వర్కర్లు, అంగన్వాడీ, పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అవగాహన కలిగించి శిబిరానికి వచ్చేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి చూపులో ఇబ్బందులతో బాధపడుతున్న వారందరిని పరీక్షించి అవసరమైన వారికి కండ్లద్దాలు, మందులు అందించడంతో పాటు శస్త్ర చికిత్సలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నదన్నారు. దూరపు చూపు ఇబ్బందులున్న వారికి ఆర్డర్ ద్వారా ఇప్పటివరకు 17వేల కండ్లద్దాలు తెప్పించి ప్రజాప్రతినిధులు, ఆశ వర్కర్ల ద్వారా అందించామన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, డాక్టర్లు కిరణ్, కృతిక, శైలేందర్, జడ్పీటీసీ మేఘమాల, ఎంపీడీవో గణేశ్రెడ్డి, సర్పంచ్ ఉమ, ఏపీఎంలు సుసిల్వ, మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సంతోశ్కుమార్, పంచాయతీ కార్యదర్శి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఈ శిబిరాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 2,56,100 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో పురుషులు 1,21,210 మంది, స్త్రీలు 1,34, 890 మంది ఉన్నారు. ఇప్పటివరకు 26,952 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 25 వేల మందికి అద్దాల కోసం ఆర్డరిచ్చారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 35 బృందాలు 5665 మందికి కంటి పరీక్షలు చేశారు. 509 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 602 మందికి ఆర్డర్లు ఇచ్చినట్లు డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డి, మార్చి24: సంగారెడ్డి జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 17126 మందికి కంటి పరీక్షలు చేశారు. 1078 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 1320 మందికి శస్త్ర చికిత్సల నిమిత్తం దవాఖానలకు ప్రతిపాదించారు.