మెదక్ అర్బన్, డిసెంబర్ 12 : మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజర్షి షా, ఆర్టీసీ డీఎం సుధ, అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన, రక్షణ లభిస్తాయన్నారు. ‘మహాలక్ష్మి’ మహిళలకు ఉపయోగకరంగా ఉందని తెలిపారు.
ఇప్పటివరకు మెదక్ డిపో పరిధి 72,812, నర్సాపూర్ డిపో పరిధిలో 26,419 మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. మెదక్ నియోజకర్గంలోని బస్ డిపోల్లో మరుగుదొడ్లు, డిపో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆరు బయట మూత్ర విసర్జన చేసేవారికి ఫైన్ వేయాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. డిపో వద్ద హోటల్ యజమానులు హోటళ్లలోనే మరుగదొడ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో మెదక్ ఎమ్మార్వో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్సాగర్ పాల్గొన్నారు.