మెదక్ అర్బన్, జూన్11: మెదక్ జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం సజావుగా ముగిసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 7 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించామని, జిల్లాకు చెందిన 3,293 అభ్యర్థులు కేటాయించామని పేర్కొన్నారు. ఇందులో 2159 మంది (65.56 శాతం) అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. 1134 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల, మెదక్లోని గీతా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించామని తెలిపారు.
కేంద్రాల్లో భారీ బందోబస్తు: ఎస్పీ
మెదక్ జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు కేటాయించిన అన్ని పరీక్షా కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేసినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 7 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమై న భద్రత నిర్వహించినట్లు పేర్కొన్నారు.
నర్సాపూర్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
నర్సాపూర్, జూన్ 11: నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఏర్పాటుచేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదివారం సందర్శించారు. ఈ కేంద్రంలో 1211 మంది అభ్యర్థులను కేటాయించగా, 779 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా ముగిసిందని తెలిపారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి, జూన్11: సంగారెడ్డి జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు 62.35 శాతం అభ్యర్థులు హారయ్యారని కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. జిల్లాలో మొత్తం 27 పరీక్షా కేంద్రాల్లో 8654 మంది అభ్యర్థులకు 5396 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాల, రాయల్ కళాశాల, అక్షయ జూనియర్ కళాశాల, సదాశివపేటలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను కలెక్టర్ శరత్కుమార్ సందిర్శంచారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్-1 పరీక్షకు 30శాతం అభ్యర్థులు గైర్హాజరయ్యారన్నారు. కలెక్టర్తో చీఫ్ సూపరింటెండెండ్, లైజనింగ్ అధికారులు తహసీల్దార్లు ఉన్నారు.
గీతం కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
గ్రూప్-1 పరీక్షకు ఏర్పాటుచేసిన కేంద్రాలను అదనపు కలెక్టర్ వీరారెడ్డి సందర్శించారు. పటాన్చెరు మండంలోని రుద్రారంలోని గీతం కళాశాల, పటాన్చెరులోని శిశు విహార్ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష తీరును పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట డీపీవో సురేశ్ మోహన్, ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు ఉన్నారు.