ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 41 దరఖాస్తులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి, పింఛన్లు, రెవెన్యూ సమస్యలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి తగిన న్యాయం చేయాలని సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి నగేశ్ 32 దరఖాస్తులు స్వీకరించారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ), సంగారెడ్డి కలెక్టరేట్ జూలై 3
మెదక్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి 41 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధి అవకాశాలు, పెన్షన్లు, వివిధ రకాల రెవెన్యూ సమస్యల ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి, పరిషరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు కరుణ, బ్రహ్మాజీ, ఆశాకుమారి, జయరాజ్, కృష్ణమూర్తి, రవిప్రసాద్, శ్రీనివాస్, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి ప్రజావాణికి 32 అర్జీలు
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 3: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా రెవెన్యూ అధికారి నగేశ్ తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి 32 అర్జీలు అందాయి. ఇందులో 12 అర్జీలు రెవెన్యూ శాఖలకు సంబంధించినవి, మిగతా 20 అర్జీలు ఇతర శాఖలకు సంబంధించివి ఉన్నాయి. ఆయా అర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి నగేశ్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు, కలెక్టరేట్ ఏవో, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.