మెదక్ మున్సిపాలిటీ, జూలై 24: మనఊరు-మనబడి పనులకు నిధుల కొరత లేదని, రెండు వారాల్లో పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఇరిగేషన్, పీఆర్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీలు, మండల విద్యాధికారులు, నోడల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల వారీగా ఇంతకు ముందు సమావేశంలో పనుల పురోగతి లక్ష్యాన్ని వేగవంతం చేస్తూ ఖర్చుల వివరాలను ఎఫ్టీవోలో నమోదు చేసి కలెక్టర్ లాగిన్కు పంపాలని సూచించినా, ఆశించిన పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమీక్షలు నిర్వహించి ఏమి లాభమని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అలసత్వం వహించినా, కుంటి సాకులు చెప్పినా ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. టెండర్ వేసి పనులు చేపట్టేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్ల స్థానంలో నామినేషన్ పద్ధతిలో పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పరిపాలన ఆమోదం పొందిన, రూ.30 లక్షల లోపు పనులతో పాటు ఆపై పనులు చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో రాధాకిషన్, పీఆర్ డీఈ సత్యనారాయణరెడ్డి, మిషన్ భగీరథ, పీఆర్ ఎఈలు పాల్గొన్నారు.